
హైదరాబాద్: బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించడంలో రోహిత్ శర్మ సెంచరీ కీలకమని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను చక్కదిద్దిన వైనం అద్భుతమని పాండ్యా అన్నాడు.
మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ "రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. తన ఇన్నింగ్స్తోనే మ్యాచ్ను రోహిత్ శర్మ నిలబెట్టాడు. రోహిత్ సమయోచితంగా ఆడిన విధానం చాలా బాగుంది. అతని నుంచి ఆశించేది ఈ తరహా ఇన్నింగ్స్లే. రోహిత్ బంతిని హిట్ చేసే పద్ధతిని మాటల్లో వర్ణించలేను" అని అన్నాడు.
"రోహిత్లా బంతిని బలంగా హిట్ చేసే ఆటగాడ్ని అంతకుముందు నేనెప్పుడూ చూడలేదు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. ఈ ఇన్నింగ్స్ జట్టులోని ఆటగాళ్లలో సైతం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇదంతా సపోర్టింగ్ స్టాప్ వల్లే సాధ్యమైంది" అని పాండ్యా పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో పాండ్యా అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ రాణించిన సంగతి తెలిసిందే. బౌలింగ్లో 38 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా... బ్యాటింగ్లో 14 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన బౌలింగ్పై మాట్లాడుతూ "నిజాయితీగా చెప్పాలంటే టీ20 ఫార్మాట్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది" అని అన్నాడు.
"ఒక ఓవర్లో 22 పరుగులిచ్చిన తర్వాత నిలకడగా బౌలింగ్ చేశా. సరైన ప్రాంతాల్లో బంతులు సంధించి కీలక వికెట్లను సాధించా. బ్రిస్టల్ తరహా పిచ్ల్లో వికెట్లు సాధిస్తే, పరుగుల్ని నియంత్రించడం సులువు అవుతుంది. అదే ప్లాన్తో బౌలింగ్ చేసి సక్సెస్ అయ్యా. యార్కర్ లెంగ్త్ బంతులు వేసేటప్పుడు లెంగ్త్ అనేది చాలా ముఖ్యం" అని పాండ్యా తెలిపాడు.
"అన్ని రకాల బంతుల్ని వేయడంతోనే నాకు వికెట్లు లభించాయి. నాకు ప్రతీ గేమ్ ఒక పాఠమే. నేను యంగ్గా ఉన్నప్పుడు మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగేవాడిని. ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగినా... అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆడటం అలవాటైంది. 13 బంతుల్లో 30 పరుగులా లేక 25 బంతుల్లో 25 అనేది ముఖ్యం కాదు" అని పాండ్యా తెలిపాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రోహిత్శర్మ (100 నాటౌట్) సెంచరీతో విజృంభించడంతో మరో 8 బంతులుండగానే లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మకు మద్దతుగా కెప్టెన్ కోహ్లీ (43), హార్దిక్ పాండ్యా (33) చెలరేగారు.
దీంతో మూడు టీ20ల సిరిస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరిమ్యాచ్తోపాటు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్శర్మ మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. టీ20 సిరిస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే నాటింగ్ హామ్ వేదికగా జరగనుంది.