
చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ కష్టాలలో పడింది. కీలక మూడు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లోనే శుభ్మన్ గిల్ డకౌట్గా వెనుదిరగగా.. కీలక సమయంలో చేటేశ్వర్ పుజారా (21), విరాట్ కోహ్లీ (0) ఔట్ అయ్యారు. అయితే రోహిత్ శర్మ మాత్రం అర్ధ శతకం బాది జట్టును ఆదుకున్నాడు. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ ( 80 బ్యాటింగ్: 78 బంతుల్లో 13x4, 1x6), అజింక్య రహానే (5) ఉన్నారు. స్టోన్, లీచ్, అలీ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ ఓలీ స్టోన్ బౌలింగ్లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన గిల్ (0:3 బంతుల్లో) ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయాడు. దాంతో భారత్ పరుగుల ఖాతా కూడా తెరవకుండా తొలి వికెట్ చేజార్చుకుంది. స్టోన్ ఆఫ్ స్టంప్కి వెలుపలగా బంతిని సంధించగా.. దాన్ని ఆడకుండా వదిలేయాలని ముందే నిర్ణయించుకున్న గిల్ బ్యాట్ పైకి ఎత్తేశాడు. అనూహ్యంగా టర్న్ అయిన బంతి నేరుగా స్టంప్లపైకి వచ్చింది. వికెట్లకి అడ్డుగా అప్పటికే కాలు ఉంచిన గిల్ ఫ్యాడ్కి ఆ బంతి తాకగా.. ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
అనంతరం రోహిత్ శర్మ, చేటేశ్వర్ పుజారా రెండో వికెట్కు 85 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ మూడో ఓవర్ నుంచి బ్యాట్ ఝళిపించేశాడు. స్టువర్ట్ బ్రాడ్ని లక్ష్యం చేసుకుని బౌండరీలు బాదిన హిట్మ్యాన్.. ఆ తర్వాత బెన్ స్టోక్స్ ఓవర్లో వరుసగా 6, 4 బాదేశాడు. జాక్ లీచ్ని కూడా వదల్లేదు. ఫుల్ షాట్లు, కట్ షాట్లతో ఫ్రంట్ ఫుట్పైకి వచ్చి మరీ రోహిత్ భారీ షాట్లు ఆడుతుండటంతో.. ఇంగ్లీష్ బౌలర్లు ఒత్తిడిలో కనిపించారు. ఈక్రమంలోనే హాఫ్ సెంచరీ బాదాడు. భారత్ గడ్డపై టెస్టుల్లో రోహిత్ శర్మకి ఆఫ్ స్పిన్పై తిరుగులేని రికార్డ్ ఉంది. ఇప్పటి వరకూ మూడు సార్లు మాత్రమే ఆఫ్ స్పిన్నర్లకి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ.. 70.49 స్ట్రైక్రేట్తో ఏకంగా 402 పరుగులు చేశాడు.
అయితే స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని సరిగా అర్ధం చేసుకోలేక స్లిప్లో క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (0).. మొయిన్ అలీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 86 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రోహిత్, రహానే జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 100 దాటించారు. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.