
అహ్మదాబాద్: మొతేరా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత ఓపెనర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6) వీరవిహారం చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్.. 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సామ్ కరన్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతిని ఫైన్ లెగ్లోకి భారీ సిక్సర్ బాదేసి అర్ధ శతకం అందుకున్నాడు.
అర్ధ శతకం అందుకున్న అనంతరం రోహిత్ శర్మ జోరు కొనసాగించాడు. ఓ సిక్స్, ఫోర్ బాది జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే 9వ్ ఓవర్లో బెన్ స్టోక్స్.. ఓ అద్భుత బంతితో హిట్మ్యాన్ను బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్ చివరి బంతిని వేగం తగ్గించి స్టోక్స్ వేయగా.. రోహిత్ బ్యాటు అంచుకు తగిలి వికెట్లను తాకేసింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిలకడగా ఆడడంతో 9 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది.
ఆపై వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా బౌండరీలతో మోతెక్కించాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 12 ఓవర్లో ఆఖరి మూడు బంతుల్ని వరుసగా బౌండరీకి పంపించేశాడు. తొలి బంతికి కోహ్లీ బౌండరీ బడడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 13వ ఓవర్లో స్టోక్స్ 9 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని కోహ్లీ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదేశాడు. నెమ్మది బంతినీ అతడు స్టాండ్స్లోకి పంపించడం గమనార్హం. ఆ తర్వాత స్టోక్స్ తెలివిగా బంతులేశాడు.
సూర్య, కోహ్లీ ధాటిగా ఆడడంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే రషీద్ వేసిన 13.2వ బంతికి సూర్య (37; 17 బంతుల్లో 3×4, 2×6) ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్దకు వెళ్లిన బంతిని పరుగెత్తుకుంటూ వచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో అందుకున్నాడు. బ్యాలెన్స్ తప్పుతున్నాడని తెలిసి అక్కడే వున్న జేసన్ రాయ్కి విసిరాడు. నమ్మలేని సూర్య నిరాశగా మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో పాండ్యా, కోహ్లీ ఉన్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసింది.