|
నాలుగో స్థానంలో వరుస వైఫల్యం..
టీమిండియా బ్యాటింగ్ లైనప్లో అత్యంత కీలకమైనది నాలుగో స్థానం. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే ఆటగాడు జట్టు భారీ స్కోరు చేయడానికి దోహద పడాల్సి ఉంటుంది. జట్టు భారీ స్కోరు చేయడానికి గానీ, ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని గానీ అందుకోవడానికి పునాది వేసే ఓపెనర్లు విఫలమైతే.. వారి స్థానంలో క్రీజులోకి దిగి, పాతుకుని పోవాల్సిన స్థానం అది. బాధ్యతాయుతమైన చోటు అది. అలాంటి చోట విజయ్ శంకర్ విఫలం అయ్యాడు. ఆ స్థానం కోసం ఆల్ రౌండర్ విజయ్ శంకర్ను తీసుకుంది టీమ్ మేనేజ్మెంట్. అది విఫల ప్రయోగం త్వరలోనే నిరూపితమైంది. విజయ్ శంకర్ను నాలుగో స్థానంలో ఆడించడం వల్ల దాని ప్రభావం టీమిండియా విజయావకాశాలను దెబ్బ తీయనప్పటికీ.. బ్యాటింగ్ లైనప్లో ఉన్న బలహీనతను మాత్రం బయట పెట్టగలిగింది.
|
వరుసగా రెండు మ్యాచుల్లో అదే తీరు..
నిజానికి- విజయ్ శంకర్కు టీమిండియా తుది జట్టులో అంత సులువుగా చోటు దక్కలేదు. అంతకుముందు- నాలుగో స్థానంలో కన్నడిగుడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్కు దిగేవాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడగా.. అతని స్థానంలో కేఎల్ రాహుల్ను ఓపెనర్గా పంపించింది టీమ్ మేనేజ్మెంట్. కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ప్రమోట్ చేయడం వల్ల ఖాళీ అయిన నాలుగో స్థానంలోకి విజయ్ శంకర్ను తీసుకుంది. అది కాస్తా బెడిసి కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్లతో జరిగిన మ్యాచ్లల్లో విజయ్ శంకర్ విఫలం అయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ అతను ముచ్చటగా 30 పరుగులు కూడా చేయలేకపోయాడు.
|
విజయ్ శంకర్ వైఫల్యాలపై ఆటాడుకున్న సోషల్ మీడియా!
విజయ్ శంకర్ వరుస వైఫల్యాలపై ఓ రేంజ్లో చెలరేగిపోయింది సోషల్ మీడియా. అతనిపై అనూహ్యమైన మెమెలు పుట్టుకొచ్చాయి. బాధ్యతగా ఆడితే నెత్తిన పెట్టుకునే నెటిజన్లు గానీ ట్విట్టరెట్టీలు గానీ.. విజయ్ శంకర్ పరాజయాన్ని తట్టుకోలేకపోయారు. మెమేలతో చితగ్గొట్టేశారు. దీనితో అతణ్ని పక్కన పెట్టింది టీమ్ మేనేజ్మెంట్. ఇంగ్లండ్తో మ్యాచ్లో రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్లో రిషబ్ పంత్కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.