
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి రెండు టీ20ల్లో అభిమానులతో కళకళలాడిన నరేంద్ర మోడీ స్టేడియం.. మిగిలిన మూడు టీ20ల్లో ప్రేక్షకుల్లేకుండా ఖాళీగా కనిపించనుంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో మొతేరా స్టేడియంలో జరిగే మిగిలిన మూడు టీ20లకు (మార్చి 16, 18, 20) వీక్షకులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే టిక్కెట్లు కొనుక్కున్న అభిమానులకు డబ్బులు వెనక్కిచ్చేస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ సంఘం తెలిపింది. 'టిక్కెట్లు కొనుక్కున్న వారికి డబ్బులు తిరిగిస్తాం. కాంప్లిమెంటరీ పాసులు అందుకున్న వాళ్లు స్టేడియానికి రావొద్దని కోరుతున్నాం' అని ఓ ప్రకటనలో తెలిపింది. టీ20 సిరీస్లో తొలి టీ20కి 67200 మంది అభిమానులు రాగా.. రెండో టీ20కి 66352 మంది హాజరయ్యారు. 1,30,000 మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో తొలి రెండు మ్యాచ్లకు 50 శాతం మంది అభిమానులన అనుమతించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇక్కడ జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల్లోనూ అభిమానులున్నారు.
ఇంగ్లండ్తో 5 టీ20ల సిరీస్ను ఓటమితో మొదలెట్టిన భారత్.. రెండో మ్యాచ్లో ఘన విజయంతో లెక్క సరిచేసింది. మంగళవారం జరిగే మూడో టీ20లో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం సంపాదించేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. బౌలర్లు లయ అందుకోవడం, యువ ఓపెనర్ సత్తాచాటడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆతిథ్య జట్టును ఇంగ్లండ్ ఆపగలదా? ఓటమి ఒత్తిడి నుంచి బయటపడి పోటీనివ్వగలదా? అన్నది ఆసక్తికరం.
నరేంద్ర మోడీ స్టేడియంలో ఎర్రమట్టితో కనిపిస్తున్న పిచ్.. స్పిన్కు ఎక్కువగా సహకరించే వీలుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఎక్కువగా మంచు ప్రభావం లేనప్పటికీ టాస్ నెగ్గిన జట్టు మరోసారి ఛేదనకే మొగ్గు చూపే వీలుంది. ఈ నేపథ్యంలో మరోసారి టాస్ కీలకం కానుంది. మ్యాచుకు ఎలాంటి వర్షం ముప్పులేదు.