ఐదేసిన అక్షర్, అశ్విన్.. చివరి టెస్టులో భారత్ ఘన విజయం! న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్కు సిద్ధం!

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 25 పరుగులతో రూట్ సేనను ఓడించింది. దీంతో కోహ్లీసేన 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడమే కాకూండా.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 54.5 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాట్స్మన్లలో డానియెల్ లారెన్స్ ఒక్కడే అర్ధ శతకం చేశాడు. రూట్ (30), పోప్ (15), ఫోక్స్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అశ్విన్, అక్షర్ చెరో 5 వికెట్ల తీసి ఇంగ్లండ్ నడ్డివిరిచారు. భారత్ మొదటి మ్యాచ్ ఓడి టెస్ట్ సిరీస్ గెలవడం ఇది ఆరోసారి.

30 పరుగులకే నాలుగు వికెట్లు:
ఈరోజు తొలి సెషన్లోనే రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. 6/0తో భోజన విరామానికి వెళ్లింది. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ల ధాటికి రెండో సెషన్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే అశ్విన్ ఒకే ఓవర్లో జాక్ క్రాలే (5), జానీ బెయిర్స్టో (0)ను పెవిలియన్ పంపాడు. ఇద్దరూ క్యాచ్ ఔట్ అయ్యారు. తర్వాత అక్షర్ విజృంభించి డొమినిక్ సిబ్లీ (3), బెన్ స్టోక్స్ (2)లను ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 30 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎటువంటి మెరుపులు మెరిపించకుండానే ఒక్కొక్కరుగా పెవిలియన్కు చేరుకున్నారు.

లారెన్స్ ఒక్కడే:
ఈ సమయంలో కెప్టెన్ జో రూట్ కాసేపు భారత స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. అయితే రూట్ (30), ఓలి పోప్ (15) వికెట్ల పతనాన్ని కాస్త అడ్డుకున్నా.. చివరికి స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 65 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్లో పోప్ స్టంపౌట్ అవ్వగా.. తర్వాతి ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రూట్ సేన 65 పరుగుల ఆరు వికెట్లు కోల్పోయింది. ఆపై లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బెన్ ఫోక్స్, డానియెల్ లారెన్స్ నిలకడగా ఆడడంతో టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 91/6తో నిలిచింది. మూడో సెషన్లో ఫోక్స్, బెస్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఆపై లీచ్ అండతో లారెన్స్ హాఫ్ సెంచరీ చేశాడు. చివరకు అశ్విన్ బౌలింగ్లో లారెన్స్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో భారత్ ఘన విజయం సాధించింది.

సుందర్ సూపర్:
అంతకుముందు 294/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ సుందర్ (96; 174 బంతుల్లో 10x4, 1x6), అక్షర్ పటేల్ (43; 97 బంతుల్లో 5x4, 1x6) ఇంగ్లండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ శతక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే భారత్ ఆధిక్యాన్ని 160 పరుగులకు చేరవేశారు. అయితే చివర్లో అక్షర్, ఇషాంత్, సిరాజ్ వరుసగా ఔటవ్వడంతో.. సుందర్ త్రుటిలో తొలి టెస్టు శతకాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

అక్షర్ ఇరగదీశాడు:
అక్షర్ పటేల్ మళ్లీ ఇరగదీశాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను వణికించాడు. వరుసగా మూడోసారి అయిదు వికెట్లు తీసుకున్నాడు. మూడవ టెస్టు ఆడుతున్న అక్షర్.. మొత్తం నాలుగోసారి తన ఖాతాలో 5 వికెట్లు వేసుకున్నాడు. కొత్త స్టేడియం మొతెరాలో జరిగిన మూడవ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఇక నాలుగవ టెస్టు కూడా కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. పిచ్ తీరుపై ఇంగ్లండ్ ప్లేయర్లు అసహనం వ్యక్తం చేసినా.. భారత స్పిన్నర్లు మాత్రం తమ సత్తాను చూపించారు.

స్కోరు బోర్డు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 205
భారత్ తొలి ఇన్నింగ్స్ : 365
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 135
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications