
పూణే: ఇది జీవితంలో మరచిపోలేని సీజన్ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ విజేత ఇంగ్లండ్పై వన్డే సిరీస్ గెలవడంతో కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో.. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నా.. బయో బుడగలో సాధించిన ఈ విజయం అపురూపమని క్రీడా దిగ్గజాలు, రాజకీయ నాయకులు కీర్తిస్తున్నారు. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత జట్టు వన్డే సిరీస్ను 2-1 తో కైవసం చేసుకుంది. భారత్ సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ముగించిన విషయం తెలిసిందే.
'కుర్రాళ్లకు అభినందనలు. జీవితకాలంలోనే అత్యంత కఠిన పరిస్థితుల్లో మీరు ఈ సీజన్ ఆడారు. జీవితంలో ఎప్పటికి మరచిపోలేనిది. అన్ని ఫార్మాట్లలో గొప్ప విజయాలు సాధించారు. ప్రపంచంలోనే రెండు అత్యుత్తమ జట్లు ఉత్కంఠగా తలపడ్డాయి. అందుకు మీకు వందనం' అని భారత కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశారు.
'గత వందేళ్లలో ఇంతలా ఎప్పుడూ అలిసిపోలేదు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కలలు గనే సీజన్ ఇది. ఆస్ట్రేలియాపై 5/6 సిరీస్ విజయాలు. ఇప్పుడు ఇంగ్లండ్పై 3 ఫార్మాట్లలో విజయం. కుర్రాళ్లు అదరగొట్టారు' అని న్హారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నారు.
'సిరీస్ను ఎంతో అద్భుతంగా ముగించారు. సామ్ కరన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ టీమిండియా గీత దాటేసింది. నాలుగున్నర నెలల సీజన్కు తిరుగులేని ముగింపు ఇది. తాము సాధించిన దానికి భారత జట్టు ఎంతగానో గర్వించాలి' అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీటారు.
'మూడుకు మూడూ గెలిచేశాం' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. 'సామ్ కరణ్ మంచి ప్రతిభావంతుడు. చివరి వన్డేలో ఇంగ్లండ్ విజయం కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు మంచి విజయం' అని వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. బీసీసీఐ, ఐసీసీ కూడా కోహ్లీసేనపై ప్రశంసలు కురిపించాయి.
గతేడాది నవంబర్ నుంచి మార్చి 28 వరకు భారత జట్టు రెండు బెస్ట్ టీమ్స్తో అన్ని ఫార్మాట్లు కలిపి ఆరు సిరీస్లు ఆడింది. అందులో ఐదింట్లో గెలిచింది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడ 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడగా.. సొంతగడ్డపై ఇంగ్లండ్తో నాలుగు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మినహాయించి అన్ని సిరీస్లూ కోహ్లీసేన గెలవడం విశేషం. ఈ సీజన్లో టీమిండియాకు ఆణిముత్యాల్లాంటి ప్లేయర్స్ దొరికారు. వచ్చిన చాన్స్ను ప్రతి ప్లేయర్ ఉపయోగించుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్లో వాషింగ్టన్ సుందర్, నవ్దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, టీ నటరాజన్ సత్తా చాటారు. ఇంగ్లండ్తో సిరీస్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ రాణించారు.