హైదరాబాద్: ఇంగ్లాండ్తో టెస్టు సమరం ముగిసింది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరిస్ విజయంలో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యువ స్ఫిన్నర్ జయంత్ యాదవ్లకు జనవరి 15 నుంచి పూణె వేదికగా ప్రారంభం కానున్న వన్డే సిరిస్కు విశ్రాంతి కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్తో ముగిసిన టెస్టు సిరిస్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో వన్డే సిరిస్ నుంచి ఈ స్పిన్ త్రయానికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారు. వీరి స్ధానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరిస్లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరిస్ ముగిసిన అనంతరం ఫిబ్రవరిలో బంగ్లాదేశ్తో ఓ టెస్టు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్లను భారత్ ఆడనుంది.
న్యూజిలాండ్తో ముగిసిన సిరిస్లో కూడా సెలక్టర్లు సరిగ్గా ఇలానే చేశారు. నవంబర్లో న్యూజిలాండ్తో టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం వన్డే సిరిస్కు అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి కల్పించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరిస్కు వీరిద్దరిని ఎంపిక చేశారు.

ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరిస్లో భారత విజయం సాధించడంలో ఆల్ రౌండర్లు అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్లు కీలకపాత్ర పోషించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాబోయే టెస్టు సిరిస్లలో వీరు కీలకపాత్ర పోషిస్తారని ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్లకు విశ్రాంతి కల్పించనున్నారు.
దీంతో ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్లలో వీరి స్ధానంలో భారత స్పిన్కు అమిత్ మిశ్రా నేతృత్వం వహించనున్నాడు. కాగా గాయం కారణంగా ఇప్పటికే భారత పేసర్ మహ్మద్ షమీ వన్డే, టీ20 సిరిస్కు దూరమైన సంగతి తెలిసిందే. షమీ స్ధానంలో పేసర్ ఇషాంత్ శర్మకు చోటు లభించదని వార్తలు వస్తున్నాయి.
అయితే వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపిస్తోంది. 2016లో నెహ్రా కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ గాయం కారణంగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరిస్కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరిస్లో పలువురు టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే.
ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా వన్డే, టీ20 సిరిస్ను మిస్ అవుతున్నాడు. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ కూడా 15 మంది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరిస్కు దూరమైన కారణంగా కరుణ్ నాయర్కు అవకాశం కల్పించారు.