అహ్మదాబాద్: మోతేరాలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి దిశగా పయనిస్తుంది. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 69 పరుగులు చేయాల్సిన దశలో ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లొతు కష్టాల్లో పడింది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫోక్స్ (6), లారెన్స్ (19) క్రీజులో ఉన్నారు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అశ్విన్, అక్షర్లు పోటీపడి వికెట్లు తీస్తుండగా.. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పరుగులు తీయడంలో కష్టపడుతున్నారు. రూట్ సహా ప్రధాన బ్యాట్స్మెన్ అంతా ఇప్పటికే పెవిలియన్ చేరుకున్నారు.
అంతకుముందు 6/0తో భోజన విరామానికి వెళ్లిన ఇంగ్లండ్ తర్వాత అశ్విన్, అక్షర్ల ధాటికి రెండో సెషన్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే అశ్విన్ ఒకే ఓవర్లో క్రాలే (5), బెయిర్స్టో (0)ను పెవిలియన్ పంపాడు. ఇద్దరూ క్యాచ్ ఔట్ అయ్యారు. తర్వాత అక్షర్ పటేల్ విజృంభించి డొమినిక్ సిబ్లీ (3), బెన్ స్టోక్స్ (2) ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అనంతరం జో రూట్ (30), ఓలి పోప్ (15) వికెట్ల పతనాన్ని కాస్త అడ్డుకున్నా.. చివరికి స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 65 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్లో పోప్ స్టంపౌట్ అవ్వగా.. తర్వాతి ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు 65 పరుగుల వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 91/6తో నిలిచింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫోక్స్, లారెన్స్ నిలకడగా ఆడుతున్నారు.
తొలి ఇన్నింగ్స్లో భారత్కు 160 రన్స్ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగవ టెస్ట్పైన కూడా పట్టు సాధించింది. ఇన్నింగ్స్ తేడాతోనే విజయాన్ని ఖాతాలో వేసుకునే దిశగా టీమిండియా ముందుకువెళ్తోంది.
India vs England: సునీల్ గవాస్కర్ హాఫ్ సెంచరీ.. సత్కరించిన బీసీసీఐ!!