వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. 73 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (143*) అజేయ శతకంతో కొనసాగుతున్నాడు. క్రీజులో అతడికి తోడుగా అక్షర్ పటేల్ ఉన్నాడు. రోహిత్ శర్మ (14; 41 బంతుల్లో), శుభ్మన్ గిల్ (34; 46 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (27; 59 బంతుల్లో), అరంగేట్ర బ్యాటర్ రజత్ పటిదార్ (32; 72 బంతుల్లో) నిరాశపరిచారు.
అయితే ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న శుభ్మన్ గిల్ గురించి రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో కామెంటరీగా ఉన్న రవిశాస్త్రి పరోక్షంగా గిల్కు వార్నింగ్ ఇచ్చాడు. వచ్చిన అవకాశాలను గిల్ సద్వినియోగం చేసుకోవాలని, రీఎంట్రీ కోసం పరుగుల వరద ఎదురుచూస్తున్న పుజారాను మరిచిపోవద్దని హెచ్చరించాడు.

''యువకులతో జట్టు తాజాదనంగా కనిపిస్తోంది. యువ ప్లేయర్లు తమ సత్తాను నిరూపించుకోవాలి. పుజారా ఎదురుచూస్తున్నాడనే విషయాన్ని మరచిపోవద్దు. రంజీ ట్రోఫీలో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. అంతేగాక బరిలోకి దిగడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు'' అని రవిశాస్త్రి అన్నాడు.
రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున పుజారా సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. జార్ఖండ్పై డబుల్ సెంచరీ సాధించాడు. 243 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హర్యానా జట్టుపై 49, 43 పరుగులు, విదర్భపై 43, 66 పరుగులు చేశాడు. ఇటీవల సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. కాగా, పుజారా టీమిండియాకు దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చివరిగా ఆడాడు.
అనంతరం వన్డౌన్లో శుభ్మన్ గిల్కు అవకాశాలు ఇస్తున్నారు. కానీ గిల్ వరుసగా విఫలమవుతున్నాడు.
టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ తర్వాత గిల్ 12 ఇన్నింగ్స్ల్లో 207 పరుగులే చేశాడు. 18 సగటుతో బ్యాటింగ్ చేశాడు. అత్యధిక స్కోరు 36 పరుగులు. ఇవాళ మ్యాచ్లో 46 బంతుల్లో అయిదు బౌండరీలతో 34 పరుగులు చేశాడు. అండర్సన్ వేసిన బంతిని ఢిఫెండ్ చేయడానికి ప్రయత్నించి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. అయితే గిల్ను ఏడు ఇన్నింగ్స్ల్లో అండర్సన్ అయిదు సార్లు ఔట్ చేయడం గమనార్హం. ఏడు ఇన్నింగ్స్ల్లో అండర్సన్ వేసిన 72 బంతులు ఎదుర్కొన్న గిల్ 39 పరుగులే చేశాడు. 7.80 సగటుతో మాత్రమే పరుగులు చేసి అయిదు సార్లు వికెట్లు సమర్పించుకున్నాడు.