
హైదరాబాద్: భారీ ఎత్తుగడలతో భారత్ను బజ్జో పెట్టేయాలని చూస్తోంది ఇంగ్లాండ్ జట్టు. తొలి టెస్టుకు కోహ్లీని మాత్రమే కట్టడి చేసి పరుగులు తగ్గించాలని యోచించి విఫలమైంది. అయినా 31 పరుగుల తేడాతో తొలి టెస్టు విజయాన్ని కైవసం చేసుకున్న ఇంగ్లాండ్.. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ కలిపి ఏడు వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ను టార్గెట్ చేస్తోంది. లార్డ్స్ వేదికగా గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టులో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ ప్రత్యేక వ్యూహంతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.
బర్మింగ్హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో.. లార్డ్స్ టెస్టులో అతడ్ని నిలువరించాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగానే.. జట్టు నుంచి డేవిడ్ మలాన్ని తప్పించి యువ క్రికెటర్ ఒలీ పోప్ని తీసుకుంది. ఇటీవల ఫస్ట్క్లాస్ క్రికెటర్ పోప్ అద్భుతంగా ఆడి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా.. స్పిన్నర్లని ఆడటంలో ఈ 20 ఏళ్ల హిట్టర్ ప్రత్యేకత చూపాడు.
దీంతో.. గురువారం జరగనున్న రెండో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టులో ఆ ఫస్ట్ క్లాస్ క్రికెటర్నే ఖాయం చేసేట్లుగా కనిపిస్తోంది. 'అశ్విన్ని నేను రెగ్యులర్ ఆఫ్ స్పిన్నర్గా పరిగణించడం లేదు. అతను వేసే కొన్ని బంతులు బ్యాట్స్మెన్పైకి కాకుండా.. దూరంగా వెళ్తున్నాయి. అందుకే అతడ్ని నేను సాధారణ స్పిన్నర్గానే చూస్తాను. బర్మింగ్హామ్ టెస్టులో అతను బౌలింగ్ చేసిన వీడియోలను పరిశీలించా. అతడి బౌలింగ్ శైలిని పరిశీలించి.. ఏ బంతి వేయబోతున్నాడో..? ముందే పసిగట్టవచ్చు. లార్డ్స్లో అశ్విన్ని ఎదుర్కొనేందుకు నేను సిద్ధం' అని ఒలీ పోప్ వెల్లడించాడు.
తొలి టెస్టులో బౌలర్లు సఫలమైనప్పటికీ.. విరాట్ కోహ్లీ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ నిరాశపరచడంతో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో రాణించాలని టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.