హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్లో భాగంగా పూణెలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి వన్డేలో భారీ స్కోరును ఛేదించి తన స్థాయికి తగ్గ ఆటతీరును భారత్ మరోసారి ప్రదర్శించింది. యువ ఆటగాడు కేదార్ జాదవ్ 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 120 పరుగుల, కెప్టెన్ కోహ్లీ 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులతో రాణించడంతో తొలి వన్డేలో టీమిండియా మూడు వికెట్లతో ఇంగ్లండ్ను ఓడించింది.
భారత్ గెలుపు: కోహ్లీ-జాదవ్ శతకాలు, కెప్టెన్.. మధ్యలో తొందరపడిన ధోనీ

ఇంగ్లండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అయితే తొలి వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిటైరైన తర్వాత జరిగిన ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డలో ఆడిన ధోని తొందరపడ్డారు.
27వ ఓవర్ లో హార్థిక్ పాండే వేసిన బంతి మోర్గాన్ బ్యాట్కు ఎడ్జ్ అయ్యి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది. ఆనందంతో బాల్ ను గాల్లోకి విసిరిన ధోనీకి అంపైర్ నందన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వెంటనే తనలోని కెప్టెన్ ఒక్కసారిగా బయటకు వచ్చాడు. వెంటనే ధోనీ రివ్యూ కోసం చేతులతో సైగ చేశాడు.
అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోసం కెప్టెన్ అప్పీల్ చేయవలసి ఉంటుంది. కానీ, వన్డే కెప్టెన్సీ నుంచి ఇటీవలే తప్పుకున్న తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న ధోని తన పాత అలవాటును మర్చిపోలేకపోయాడు. ఓ క్షణం తర్వాత ధోనీ తన పొరపాటు గ్రహించి సర్దుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ రివ్యూ కోసం అడగ్గా.. మోర్గాన్ అవుట్ అని తేలింది.