అహ్మదాబాద్: మొతేరా తరహా పొడి పిచ్లపై విజయవంతమవ్వాలంటే బ్యాట్స్మెన్ ఫుట్వర్క్, షాట్ల ఎంపిక కచ్చితత్వంతో ఉండాలని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సూచించాడు. స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడేటప్పుడు ఆటగాళ్లు రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించాలన్నాడు. డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తికి గురిచేసిందని అజ్జూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచులో మొత్తం 30 వికెట్లు పడగా.. అందులో 28 వికెట్లు స్పిన్నర్లే తీశారు.
పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయం అనంతరం అజారుద్దీన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'అహ్మదాబాద్ టెస్టులో స్పిన్నర్ల దాటికి బ్యాట్స్మెన్ కుప్పకూలడం నిరాశ పరిచింది. అలాంటి డ్రై ట్రాక్లపై బ్యాటింగ్ చేయాలంటే షాట్ల ఎంపికతో పాటు ఫుట్వర్క్ కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాటింగ్ సమయంలో స్పైక్ షూ ధరించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇలాంటి పిచ్లపై రబ్బర్ సోల్ ఉన్న షూలను ధరించడం మంచిది. రబ్బరు సోల్స్ బ్యాట్స్మెన్ సామర్థ్యాన్ని తగ్గించవు. బ్యాటింగ్కు అనుకూలించని ఇలాంటి నిర్జీవమైన మైదానాల్లో ఉత్తమ టెస్ట్ ఇన్నింగ్స్లను ఎన్నో చూశాను. గతంలో ఇలాంటి పిచ్లపై బ్యాట్స్మెన్ కేవలం రబ్బర్ సోల్స్ ధరించి రాణించారు' అని అజ్జూ అన్నాడు.
'రబ్బర్ షూ ధరించిన ఆటగాళ్లు పిచ్పై జారిపడుతారన్న వాదన ముమ్మాటికి తప్పు. వింబుల్డన్ లాంటి టెన్నిస్ టోర్నీల్లో ప్లేయర్లు రబ్బర్ షూలతోనూ ఆడుతున్నారు. గతంలో టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్, దిలీప్ వెంగ్సర్కార్తో పాటు విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, మైక్ గ్యాటింగ్, అలెన్ బోర్డర్ లాంటి వాళ్లు రబ్బర్ సోల్ ఉన్న షూతోనే ఆడేవారు. డ్రై పిచ్లపై రబ్బర్ సోల్ ఉన్న షూస్ను ప్రిఫర్ చేయడం మంచిదని నా అభిప్రాయం' మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నాడు.
It was disappointing to watch the batsmen come a cropper in the Ahmedabad Test.The key to batting on such dry tracks and rank turners is shot-selection and assured footwork. It makes little sense to wear spikes when batting.Rubber soles dont hamper ability of batsmen (1/3)
— Mohammed Azharuddin (@azharflicks) February 26, 2021
మొతేరా టెస్టులో రోహిత్ శర్మ, జాక్ క్రాలీ మాత్రమే అర్ధ శతకాలు చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది స్పిన్ పిచ్ను విమర్శిస్తుండగా.. సునిల్ గవాస్కర్, గ్రేమ్ స్వాన్ లాంటి వారు స్పిన్నర్ల సత్తాను ప్రశంసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో తలపడ్డ డేనైట్ టెస్టులో భారత్, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. స్పిన్నర్ల బంతులను ఎదుర్కోలేక వారు త్వరగా పెవిలియన్ చేరారు. దాంతో ఇంగ్లండ్ 112, 81 స్కోర్లకే పరిమితమవ్వగా భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నేను క్రికెటర్.. దాని గురించే మాట్లాడా! కల్పితాలు జోడించొద్దు: అశ్విన్