
పూణే: మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ గెలవడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది కోహ్లీసేనకు ఓ గుణపాఠం అని విమర్శలు చేశాడు. రానున్న రెండేళ్లలో స్వదేశంలో జరుగనున్న 2023 వన్డే ప్రపంచకప్లో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అన్నాడు.
మ్యాచ్ అనంతరం మైఖేల్ వాన్ రెండు ట్వీట్లు చేశాడు. 'భారత జట్టుకు ఇదొక గుణపాఠం కావాలి. 40 ఓవర్లపాటు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం చూస్తుంటే.. రానున్న రెండేళ్లలో స్వదేశంలో జరుగనున్న 2023 ప్రపంచకప్లో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితే వస్తుందేమో.. ఫ్లాట్ వికెట్లపై 375+ స్కోరు నమోదు చేయగల సత్తా వారికి ఉంది. కానీ వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అదే సమయంలో ఇంగ్లండ్ ఈ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగింది' అని వాన్ అన్నాడు.
టీమిండియా బౌలింగ్ గురించి మైఖేల్ వాన్ మాట్లాడుతూ... 'అసలు ఆ బౌలింగ్ విధానాలేంటి అలా ఉన్నాయి. ఈసారి విరాట్ కోహ్లీ అత్యుత్తమ బౌలర్లను ప్రయోగించాలి. వెరీ పూర్ కెప్టెన్సీ' అంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరును విమర్శించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ విధానం బాగుందని, ఇలాంటి దూకుడుతో ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి వాన్ పిచ్, టాస్ లాంటో విషయాలపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
రెండో వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 336 భారీ స్కోర్ సాధించింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసిన భారత్.. 40 ఓవర్లకు 210/3తో నిలిచింది. ఈ క్రమంలోనే చివరి 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు సాధించింది. ఆదిలో ధావన్ (4), రోహిత్ (25) విఫలమైన నేపథ్యంలో కోహ్లీ (66), రాహుల్ (108) జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ వికెట్ కాపాడుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. కోహ్లీ ఔటైన తర్వాత కూడా భారత్ బ్యాటింగ్ శైలిలో మార్పు రాలేదు. రాహుల్తో జోడీ కట్టిన పంత్ (77) తొలుత కాస్త నిదానంగా ఆడాడు. అలా 40 ఓవర్ల వరకు స్కోరుబోర్డు నెమ్మదిగా సాగింది. ఆపై పంత్, హార్దిక్ (35) సిక్సర్లతో చెలరేగడంతో జట్టు స్కోర్ పరుగులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన అతిజాగ్రత్త బ్యాటింగ్ పద్ధతిపై వాన్ విమర్శలు గుప్పించాడు.