లండన్: పిచ్ల గురించి అనవసరంగా రచ్చ చేస్తున్నారని, దానికి బదులు ఆటగాళ్లు, వారి ప్రదర్శనలపై చర్చించాలని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సెకండ్ టెస్ట్లో చెన్నై పిచ్పై విమర్శలు వచ్చాయి. పిచ్ అనూహ్యంగా ఉందని, ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉందని వాన్తో సహా పలువురు మాజీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దానిపై పెద్ద చర్చ జరగడంతో హిట్ మ్యాన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దీటుగా బదులిచ్చాడు.
పిచ్ల గురించి కాకుండా ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడాలంటూ రోహిత్ సూచించాడు. రెండు జట్లకూ పిచ్ సమానమేనని, మెరుగ్గా ఆడిన వాళ్లు గెలుస్తారని స్పష్టంచేశాడు.
'పిచ్ల గురించి ఎందుకింత చర్చ జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలంగా భారత్లో పిచ్ల స్వభావం ఇలాగే ఉంది. అందులో మార్పు రావాలని అనుకోవట్లేదు. స్థానిక పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మా గురించి ఎవరూ ఆలోచించరు.
అలాంటప్పుడు ఇతర జట్ల గురించి మేమెందుకు ఆలోచించాలి?సొంతగడ్డపై సానుకూలత అంటే అదే. లేదంటే పూర్తిగా మార్చేయండి. ఎక్కడైనా పిచ్లన్నీ ఒకేలా ఉండేలా ఐసీసీ నిబంధనల్ని రూపొందించాలి. మేం విదేశాలకు వెళ్లినప్పుడు ప్రజల వ్యవహార శైలి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. పిచ్ల గురించి అసలు చర్చే అవసరం లేదని నేను అనుకుంటా'' అని రోహిత్ పేర్కొన్నాడు. రెండు జట్లూ ఒకే పిచ్పై ఆడతాయని, మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని తెలిపాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసిన మైకేల్ వాన్.. హిట్ మ్యాన్ కామెంట్స్తో ఏకీభవిస్తున్నానన్నాడు.
Totally agree ... https://t.co/SR9uEZMFrN
— Michael Vaughan (@MichaelVaughan) February 21, 2021