
లండన్: మొతేరా వేదికగా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీసులో టాస్ కీలకం అవుతుండటంపై ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సెటైర్లు వేశాడు. చూస్తుంటే భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్లో మెరుగైన టాసర్ కప్ను కైవసం చేసుకుంటారేమోనని ట్వీట్ చేశాడు. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన వందో అంతర్జాతీయ టీ20లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన కొహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ సునాయాసంగా ఛేదించింది.
ఐదు టీ20 సిరీస్లో ఇప్పటి వరకు మూడు మ్యాచులు జరిగాయి. తొలి మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పేలవంగా ఆడింది. తక్కువ స్కోరే చేయడంతో మోర్గాన్ సేన విజయం సాధించింది. రెండో టీ20లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్ ఎంచుకొని మోర్గాన్ సేనను దెబ్బకొట్టాడు. ఆపై హాఫ్ సెంచరీతో జట్టును గెలుపు బాట పట్టించాడు. ఇక మంగళవారం జరిగిన మూడో టీ20లోనూ ఇదే పునరావృతమైంది. టాస్ గెలిచిన ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకొని కోహ్లీసేనను మోస్తరు స్కోరుకే పరిమితం చేశాడు. దాంతో ఇంగ్లండ్ 2-1తో సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లింది.
టీ20 సిరీస్లో టాస్ కీలకం అవుతుండటంతో ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. 'చూస్తుంటే భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ టాసర్ విజేతగా నిలుస్తాడేమో అనిపిస్తోంది' అని పేర్కొన్నాడు. అయితే తమ ఓటములకు టాస్ను నిందించబోమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 'ఒకవేళ టాస్ ఓడితే ప్రత్యర్థి అడిగింది చేయాలి. కొత్త బంతితో ఇంగ్లండ్ బౌలర్లు అదరగొట్టాడు. తొలి ఆరు ఓవర్లలో అసలు పరుగులు చేయనివ్వలేదు. కఠినంగా బంతులేశారు. మేం పుంజుకొనేందుకు ప్రయత్నించినా రెండో అర్ధ భాగంలో మా తీవ్రత, బలం తగ్గింది' అని అన్నాడు.
మూడో టీ20లో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు ఓ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్పై ఇంగ్లండ్ జట్టుకు 99వ విజయం కావడం గమనార్హం. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇన్ని విజయాలు సాధించిన ఇంగ్లండ్.. భారత్పై అత్యధిక విజయాలు సాధించిన జట్లలో వెస్టిండీస్తో కలిసి రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా జట్టు 132 విజయాలతో అగ్రస్థానంలో ఉంది.