
వాన్ అభ్యంతరం
ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తాజాగా తొలి రెండు టెస్టులకి ఇంగ్లాండ్ జట్టుని ప్రకటించింది. జానీ బెయిర్స్టోతో పాటు సామ్ కరన్, మార్క్వుడ్లకు చోటివ్వలేదు. టీమ్ రొటేషన్ పాలసీలో భాగంగా ఈ ముగ్గురికీ రెస్ట్ ఇచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. బెయిర్స్టోకి చోటు దక్కకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాజాగా వాన్ ట్విటర్ వేదికగా స్పదించాడు.

తెలివైన నిర్ణయం కాదు
'భారత్తో నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభ మ్యాచ్లకి జానీ బెయిర్స్టో జట్టులో ఉండింటే బాగుండేది. ఉపఖండం పిచ్లపై స్పిన్నర్లని సమర్థంగా ఎదుర్కోగల ఇంగ్లాండ్ టాప్-3 బ్యాట్స్మెన్లలో బెయిర్స్టో కూడా ఒకడు. మరి అలాంటి బ్యాట్స్మెన్ని తొలి రెండు టెస్టులకి దూరంగా పెట్టడం.. తెలివైన నిర్ణయం కాదు. క్రికెట్ ప్రపంచంలో భారత్ అత్యుత్తమ జట్టుగా ఉంది. మరి అలాంటి జట్టుపై బరిలోకి దిగే సమయంలో జట్టు కూడా బలంగా ఉండాలి. ప్రపంచం ఏమైనా పిచ్చిదా?' అని మైకేల్ వాన్ ట్వీట్ చేశారు.

బెయిర్స్టోకు మంచి రికార్డు
భారతదేశంలో కూడా బెయిర్స్టోకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆరు టెస్టుల్లో 40.11 సగటుతో 361 పరుగులు చేశాడు. ఉపఖండంలో అతని టెస్టు సగటు 40గా ఉంది. అంతేకాదు ఓ సెంచరీ కూడా చేశాడు. 72 టెస్టుల్లో 35.03 సగటుతో ఆరు సెంచరీలు మరియు 21 అర్ధ సెంచరీలతో 4169 పరుగులు చేశాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్న బెయిర్స్టోకి.. భారత్ పరిస్థితులపై చక్కటి అవగాహన ఉంది. క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం అతడిది.

ఇంగ్లాండ్ టీమ్
జో రూట్ (కెప్టెన్), జోప్రా ఆర్చర్, మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, డోమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లీ, బెన్ ఫోక్స్, బెన్ స్టోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.