హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్కు క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 15న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడైనట్టు మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే పూణెలోని గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ జరగడానికి ముందు నెల రోజుల ముందు అంటే డిసెంబర్ 15న టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా కేవలం 12 రోజుల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు ఎంసీఏ తెలిపింది.
ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా విక్రయించే టికెట్లన్నీ అమ్ముడు పోయినట్లు ఎంసీఏ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి వన్డేలో 37,406 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం మొత్తం పూర్తిగా నిండిపోనుంది. సుమారు మూడేళ్ల విరామం తర్వాత వన్డే మ్యాచ్ జరగనుండటంతో అభిమానుల నుంచి అనూహ్య మద్దతు లభించింది.

పూణెలో చివరిసారిగా అక్టోబర్ 13, 2013న భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. దీంతో చాలా రోజుల తర్వాత వన్డే జరగనుండటంతో టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజు నుంచే స్ధానికులు వాటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లతో సిరిస్ జరగనుంది.
తొలి వన్డే జనవరి 15న ప్రారంభం అవుతుండగా రెండో వన్డే జనవరి 19న కటక్, మూడో వన్డే కోల్ కత్తాలో జనవరి 22న జరగనుంది. వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. జనవరి 26న తొలి టీ20 కాన్పూర్లో జరుగుతుండగా, రెండో టీ20 నాగ్ పూర్, మూడో టీ20 బెంగుళూరులో జరగనున్నాయి.