
హైదరాబాద్: బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించే దిశగా టీమిండియా ముందుకు సాగుతుంది. జట్టు స్కోరు 8 పరుగులకే కేఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కోహ్లీ-రోహిత్ శర్మ ఆదుకున్నారు.
హాఫ్ సెంచరీ అనంతరం విరాట్ కోహ్లీ(66) దూకుడుగా ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ ఫ్లంకెట్ బౌలింగ్లో రెండో బాల్ను విన్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఫ్లంకెట్ బౌలింగ్లో సెంచరీ చేశాడు. 106 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 15 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు.
ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఇది మూడు సెంచరీ కాగా... మొత్తంగా 25వ సెంచరీ కావడం విశేషం. 35 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(101), రిషభ్ పంత్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు.
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత:
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 66(7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్లో విరాట్ కోహ్లీకి ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ. తద్వారా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్లో వరుసగా ఐదు సెంచరీలు బాదిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు.
కోహ్లీ గత నాలుగు మ్యాచుల్లో వెస్టిండీస్ (72), అఫ్గానిస్థాన్ (67), పాకిస్థాన్ (77), పాకిస్థాన్పై (82) హాఫ్ సెంచరీలు సాధించాడు. 1992 ప్రపంచకప్లో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. 2015 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీన్ స్మిత్ కూడా ఇలా వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.
దీంతో స్టీవ్ స్మిత్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు. కాగా, హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీ ఫ్లంకెట్ బౌలింగ్లో రెండో బాల్ను విన్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్డేల్లో ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ (1238) పేరిట ఉన్న రికార్డునూ కూడా కోహ్లీ అధిగమించాడు.
కోహ్లీ మరో 31 పరుగులు సాధిస్తే ప్రపంచకప్లో 1000 పరుగులు సాధించిన భారత మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. టీమిండియా తరఫున సచిన్ (2278), గంగూలీ (1006) ప్రపంచకప్లో వెయ్యికి పైగా పరుగులు సాధించారు.
అంతకముందు ఓపెనర్ లోకేశ్ రాహుల్ను క్రిస్ వోక్స్ పెవిలియన్కు పంపాడు. 9 బంతులు ఆడిన రాహుల్ (0) వోక్స్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. కాగా, జానీ బెయిర్ స్టో(111; 109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్(79; 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్(66;57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
జో రూట్(44; 54 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటాడు. ఇంగ్లండ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షమీ కీలక వికెట్లు సాధించాడు. బుమ్రా, కుల్దీప్లు తలో వికెట్ తీశారు.
{headtohead_cricket_2_3}