
లండన్: లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో కోహ్లీసేన పీకల్లోతు కష్టాల్లో పడింది. పలుమార్లు వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్లో 15 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), రహానే పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.
తొలి రోజు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వాయిదా పడగా, రెండో రోజైన శుక్రవారం ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ మురళీ విజయ్ వికెట్ను కోల్పోయింది.
అండర్సన్ తన స్వింగ్ బౌలింగ్తో మురళీ విజయ్ను పెవిలియన్కు చేర్చాడు. జేమ్స్ ఆండర్సన్ వేసిన అద్భుత బంతికి విజయ్ డకౌట్గా వెనుదిరిగాడు. తొలి ఓవర్ నాలుగు బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్న విజయ్.. అదే ఓవర్లో ఐదో బంతికి ఓపెనర్ మురళీ విజయ్ డకౌటయ్యాడు.
దీంతో భారత్ పరుగుల ఖాతా కూడా తెరకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 6.1వ బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (8)ను ఔట్ చేశాడు. రెండు ఫోర్లు కొట్టి ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నట్లే కనిపించిన రాహుల్ కీపర్ బెయిర్స్టో చేతికి క్యాచ్ ఇచ్చాడు.
ఈ క్రమంలో మరోమారు వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సమయంలో అంఫైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. లంచ్ విరామం అనంతరం తిరిగి మ్యాచ్ ప్రారంభం కాగా 15 పరుగుల వద్ద పుజారా (1) రనౌట్గా పెవిలియన్కు చేరాడు. దీంతో కోహ్లీసేన 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో 9వ ఓవర్ మూడో బంతి పూర్తయ్యాక మరోమారు వర్షం పడడంతో అంఫైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో పుజారా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
లార్డ్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో రెండో స్పిన్నర్ వైపే భారత్ మొగ్గుచూపింది. ఇక, ఇంగ్లాండ్ జట్టు తరుపున ఈ టెస్టులో ఒలీ పోప్ అరంగేట్రం చేశాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మైదానంలో 17 టెస్టులాడిన భారత్ కేవలం రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా కాగా, 11 మ్యాచుల్లో ఓడింది.