
హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. భారత బౌలర్లు అటు పేస్ ఇటు స్పిన్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో తొలుత అశ్విన్, ఆ తర్వాత ఇషాంత్ శర్మ వరుసగా వికెట్లు తీసి ఇంగ్లాండ్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారు.
ఓవర్ నైట్ స్కోరు 9/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే అశ్విన్ ధాటికి వరుసగా రెండు వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్లో బంతిని కట్ చేయబోయి ఓపెనర్ జెన్నింగ్స్ (8) స్లిప్లో కేఎల్ రాహుల్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
ఆ తర్వాత అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కెప్టెన్ జో రూట్ (14: 35 బంతుల్లో) కూడా అదే తరహాలో వికెట్ చేజార్చుకున్నాడు. ఇక, గురువారం ఆట ముగుస్తుందన్న దశలో ఓపెనర్ అలెస్టర్ కుక్ని డకౌట్గా అశ్విన్ పెవిలియన్ చేర్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రెండు వికెట్లు కూడా అశ్విన్ ఖాతాలోనే పడ్డాయి.
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును మలాన్(20), బెయిర్స్టో(28) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ వీరిద్దరి జోడీని విడగొట్టాడు. ఈ ఇద్దరినీ ఇషాంత్ ఔట్ చేయడం విశేషం. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన బెన్ స్టోక్స్(6) కూడా స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు.
దీంతో మూడో రోజైన శుక్రవారం అశ్విన్, ఇషాంత్ చెరో మూడు వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బతీశారు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ ప్రస్తుతం 99 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి ఇన్నింగ్స్లో 26 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 62 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు 287 పరుగులకి ఆలౌటైంది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు విరాట్ కోహ్లీ (149) సెంచరీతో రాణించడంతో గురువారం 76 ఓవర్లలో 274 పరుగులకి ఆలౌటైంది.