
హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో లంచ్ విరామ సమాయనికి టీమిండియా 21 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం భారత్ ఇంకా 211 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్లో విరాట్ కోహ్లీ(9), అజ్యింకె రహానే(8) పరుగులతో ఉన్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 89.4 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొమ్మిది పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ యువ బౌలర్ శామ్ కుర్రన్ తన అద్భుతమైన బౌలింగ్తో భారత్ టాపార్డర్ను కుప్పకూల్చాడు.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 287 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం క్రీజులోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. భారత ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ తొలి వికెట్కు 50 పరుగులు జోడించారు. అయితే 20 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర శామ్ కురన్ బౌలింగ్లో మురళీ విజయ్ ఎల్బీగా ఔటయ్యాడు.
ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కుర్రన్ వేసిన బంతిని మురళీ విజయ్ ఎదుర్కొన్నాడు. వెంటనే బౌలర్ ఎల్బీగా అప్పీల్ చేసినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో ఆ జట్టు కెప్టెన్ జో రూట్ రివ్యూ సాయం కోరాడు. రివ్యూలో మురళీ విజయ్(20) ఔట్గా తేలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ తొలి బంతికే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించాడు.
అయితే, ఆ తర్వాత బంతికే కేఎల్ రాహుల్(4) బౌల్డయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం 16వ ఓవర్లో కుర్రన్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న ధావన్(26) స్లిప్లో ఉన్న మలాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 50 పరుగులకు వికెట్ కోల్పోకుండా పటిష్ఠ స్థితిలో ఉన్న భారత్ 59 పరుగులకు 3 వికెట్లతో కష్టాల్లో పడింది.
ఇదిలా ఉంటే, తొలి టెస్టులో ఇంగ్లాండ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్లో ఉన్న ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ జాస్ బట్లర్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా.. అతని ఎడమ చేతి మధ్య వేలికి గాయమైంది. దీంతో లంచ్ బ్రేక్ సమయంలో ఎక్స్రే కోసం బట్లర్ని హాస్పిటల్కి తరలించారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత బట్లర్ ఆడే అవకాశం ఉందా లేదా అని వైద్యులు తెలియజేయనున్నారు. ఒక వేళ అతను ఆడే అవకాశం లేకుంటే.. అతని స్థానంలో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు జానీ బెయిర్స్టోకి అప్పగించే అవకాశం ఉంది.