
లండన్: ఇంగ్లాండ్తో ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆరంభంలోనే తడబాటుకు గురైంది. మళ్లీ అదే నిర్లక్ష్యపు ఆట తీరుతో తొలి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీ (4) పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కి 60 పరుగులు జోడించిన ధావన్, రాహుల్ల జోడీకి ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ విడదీశాడు. వోక్స్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి ధావన్(35) బట్లర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
ఆ తర్వాత లోకేశ్ రాహుల్(23) మళ్లీ వోక్స్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, పుజారాలు కలిసి భారత ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే వోక్స్ వేసిన 27వ ఓవర్ నాలుగో బంతికి పుజారా(14) రషీద్కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ వికెట్ వెంటనే అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు.
దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 26.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్కు 3 వికెట్లు పడగొట్టాడు. మొదటి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయం పాలైన టీమిండియా తన ఓటముల నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదు.
మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వాటిని జట్టులోని ఆటగాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. మూడో టెస్టులోనూ అదే నిర్లక్ష్యపు ఆటతీరుతో భారత ఆటగాళ్లు తమ వికెట్లను సమర్పించుకున్నారు. ఓ దశలో బాగానే ఆడుతున్నట్లు కనిపించినప్పటికీ 19వ ఓవర్ నుంచి భారత వికెట్ల పతనం మొదలైంది.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత ప్లేయర్లు చేతులకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. ఇటీవలే భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రధాని వాజ్పేయి కూడా రెండు రోజుల క్రితం మృతి చెందారు. వీరిద్దరికీ సంతాపం ప్రకటిస్తూ భారత ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్స్ను ధరించారు.