హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్లను నష్టపోకుండా 20 ఓవర్లకు గాను 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లోకేశ్ రాహుల్ 30, పార్ధీవ్ పటేల్ 28 పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా లోకేశ్ రాహుల్, పార్ధివ్ పటేల్ బ్యాటింగ్కు దిగారు.
తొలి ఇన్నింగ్స్: ఇంగ్లాండ్ 477 ఆలౌట్
చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. 284/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 193 పరుగులు చేసింది. అలీ 146, రూట్ 88 నిలకడగా ఆడగా, రెండో రోజు డాసన్ 66(నాటౌట్), అదిల్ రషీద్ 60 పరుగులు చేశారు.వికెట్లు పడుతున్నా, టెయిలెండర్ల నిలకడగా రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు నమోదు చేసింది.
రెండో రోజు ఆటలో భాగంగా బెయిర్ స్టో(49), బట్లర్(5), మొయిన్ అలీ(146) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ తడబడింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రషీద్, డాసన్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 400కు పైగా పరుగులు చేసింది. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. భారత బౌలర్లలో జడేజాకు 3, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు 2 వికెట్లు దక్కించుకోగా, అశ్విన్, అమిత్ మిశ్రాలకు చెరో వికెట్ లభించింది.
9వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టువర్ట్ బ్రాడ్ని కేఎల్ రాహుల్ రనౌట్ చేశాడు. దీంతో జట్టు స్కోరు 455 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఐదో టెస్టులో ఇంగ్లాండ్ టెయిలెండర్లు మెరుగ్గా ఆడారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్లు అర్ధ సెంచరీలు పూర్తి చేశారు.

డాసన్ అర్ధసెంచరీ
ఐదో టెస్టులో అనూహ్యంగా అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన డాసన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్లోనే తొలి టెస్టు ఆడుతున్న డాసన్ 121 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. రెండో రోజు మొదటి సెషన్లో ఇంగ్లాండ్ వెనువెంటనే వికెట్లను కోల్పోయిన దశలో బ్యాటింగ్కు దిగి డాసన్.. రషీద్తో కలిసి 107 పరుగులు జోడించాడు. 60 పరుగులు చేసి రషీద్ ఔట్ కావడంతో బ్రాడ్తో కలిసి ఆడుతున్నాడు. అయితే ఒక మ్యాచ్లో ఇంగ్లాండ్ 8, 9వ నెంబర్ బ్యాట్స్మెన్ అర్ధ సెంచరీలు చేయడం ఇది ఐదో సారి.
టీ విరామానికి ఇంగ్లాండ్ 452/8:
8వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఐదో టెస్టులో ఇంగ్లాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 429 పరుగుల వద్ద రషీద్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. కాగా, నిలకడగా ఆడుతున్న డాసన్ 121 బంతులను ఎదుర్కొని 4ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడీ ఎనిమిదో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 148 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది. ప్రస్తుతం డాసన్ 50, బ్రాడ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 352/7
284/4పరుగుల ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ విరామ సమయానికి 119 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రషీద్ 8, డాసన్ 27 పరుగులతో ఉన్నారు.
భారత బౌలర్లలో జడేజా 3, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. తొలి రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి 68పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు రెండో రోజు లంచ్ విరామ సమయానికి 68పరుగులే చేయడం గమనార్హం.
115 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 345/7
284/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. 115 ఓవర్లకు గాను 345 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రషీద్ 7, డాసన్ 21 పరుగులతో ఉన్నారు.

మొయిన్ అలీ 146 అవుట్
ఐదో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మెయిన్ అలీ 146 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండో రోజు ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో అలీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 262 బంతులు ఆడిన అలీ 13 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 146 పరుగులు పూర్తి చేశాడు. దీంతో107 ఓవర్లకు గాను ఏడు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. రషీద్ 2, డాసన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆరో వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోరు 300 పరుగుల వద్ద జాస్ బట్లర్(5) పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో జోస్ బట్లర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరాడు. 284/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజైన శనివారం ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
