రాజ్కోట్ వేదికగా రేపటి నుంచి భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలిచి ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. రాజ్కోట్ టెస్టులో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యానికి దూసుకెళ్లాలని ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్లో మన జట్టు ఫేవరేట్ అయినప్పటికీ సీనియర్ ప్లేయర్లు దూరమవ్వడం టీమిండియాను కాస్త కలవరపెడుతోంది.
అయితే జట్టు కూర్పుపై తీవ్రంగా చర్చసాగుతోంది. గత రెండు టెస్టుల్లో బ్యాటుతో నిరాశపరిచిన తెలుగోడు కేఎస్ భరత్పై వేటు పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. భరత్ స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ మూడో టెస్టులో అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భరత్, ధ్రువ్ జురెల్లో ఎవరు ఉత్తమం అని నెటిజన్లు అన్వేషిస్తున్నారు.

వైజాగ్కు చెందిన భరత్ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఇప్పటివరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడిన భరత్ 20 సగటుతో 221 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 44 మాత్రమే. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భరత్ సత్తాచాటాడు. 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 36 సగటుతో 5101 పరుగులు చేశాడు. 10 సెంచరీలు కూడా సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 35 సగటుతో 2167 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో భరత్ సత్తాచాటినప్పటికీ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్పై శతకంతో రాణించాడు.
మరోవైపు యూపీకి చెందిన 23 ఏళ్ల ధ్రువ్ జురేల్కు భరత్తో పోలిస్తే అనుభవం పెద్దగా లేదు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 10 లిస్ట్-ఏ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 46 సగటుతో 790 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలో 189 పరుగులు చేశాడు. జురేల్కు అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ సగటు కాస్త మెరుగ్గా ఉంది. ఇక ఐపీఎల్ విషయానికొస్తే జురేల్ 172 స్ట్రైక్రేటుతో పరుగులు సాధించాడు. కానీ భరత్ ఐపీఎల్లో దూకుడుగా కాకుండా నిలకడగా పరగులు సాధించాడు.
వికెట్ కీపింగ్ నైపుణ్యంలో కేఎస్ భరత్దే ఆధిపత్యం. మన స్పిన్నర్లు రెడ్ బాల్ క్రికెట్లో సంధించే బంతుల్ని భరత్ గొప్పగా అందుకుంటున్నాడు. ధ్రువ్ జురేల్కు ఈ విషయంలో అనుభవం తక్కువగా ఉంది. కానీ పరుగులు సాధించడంలో భరత్ విఫలమవ్వడంతో ధ్రువ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.