పీటర్సన్ పంచ్:
గత నెలలో ఆస్ట్రేలియాపై టీమిండియా 2-1తో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత కెవిన్ పీటర్సన్ ఓ ట్వీట్ చేస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 'ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన టెస్ట్ సిరీస్ అద్భుతం. అయితే మరీ అంతగా సంబరాలు చేసుకోకండి. రెండు వారాల్లో అసలైన టీమ్ వస్తోంది జాగ్రత్త' అని గత నెల 19న కేపీ ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగానే.. హిందీలో ట్వీట్ చేస్తూ పంచ్ ఇచ్చాడు. 'ఆస్ట్రేలియా సిరీస్ విజయం సాధించినప్పుడే హెచ్చరించా. భారత్ ఎక్కువగా సంబరాలు చేసుకోవద్దని. అదే నిజం అయింది ఇప్పుడు' అని పేర్కొన్నాడు.
అభిమానులు బాధపడకండి:
తొలి టెస్టు ఓటమిపై టీమిండియా అభిమానులు ఫలితంపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. గత సిరీస్ల్లో తొలి మ్యాచ్ కోల్పోయినా.. భారత్ సిరీస్ సాధించిందని గుర్తు చేస్తున్నాడు. 'భారత అభిమానులారా.. మీరెవరు బెంగపడకండి. ఆసీస్ టూర్ను ఇలాగే ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత సిరీస్ను గెలిచింది. అంతకముందు స్వదేశంలోనూ తొలి టెస్టు మ్యాచ్ ఓడి ఆ తర్వాత సిరీస్ను సొంతం చేసుకున్న ఘనత మన టీమిండియాకు ఉంది. ఒక్కమ్యాచ్ ఓడిపోయినంత మాత్రానా సిరీస్ కోల్పోయినట్టు కాదు.. ధైర్యంగా ఉండండి' అని ట్వీట్ చేశాడు.

ఓటమితో ప్రారంభించి:
గతేడాది డిసెంబర్లో ప్రారంభమైన బోర్డర్- గవాస్కర్ ట్రోపీలో టీమిండియా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన మిగతా మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. అంతకముందు 2019లో స్వదేశంలో ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్ను ఇలాగే గెలిచింది. ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో ఓటమి పాలయిన తర్వాత ఫుంజుకొని 2-1 తేడాతో సిరీస్ను పట్టేసింది. ఇక భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు చెన్నై వేదికలోనే ఫిబ్రవరి 13 నుంచి జరగనుంది.

మాజీలు ఏమన్నారంటే:
'టాస్ కీలకమే. కానీ ఓటమికి అదే కారణం కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో చివరి మూడు మ్యాచ్ల్లో టాస్ ఓడాం. అయినా రెండు టెస్టుల్లో విజయం సాధించాం. మరో టెస్టును డ్రాగా ముగించాం. అయితే ఇప్పుడు సిరీస్ స్వదేశంలో జరుగుతోంది. తొలి రెండు రోజుల్లో ఉన్నట్లుగా పిచ్ ఫ్లాట్, స్లోగా లేదు. ఇది భారత కఠినమైన పిచ్. తొలి టెస్టులో ఇంగ్లండ్ గొప్ప విజయం సాధించింది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసును ఆసక్తికరంగా మార్చింది' అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ట్వీటాడు.
'ఇంగ్లండ్కు అభినందనలు. భారత్లో భారత్ను ఓడించడం అంత ఈజీ కాదు. ప్రత్యేకంగా ప్రస్తుత జట్టుని. అయితే ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. టీమిండియా నుంచి గొప్ప పోరాటాన్ని ఆశిస్తున్నాం' అని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు.
'అద్భుత ప్రదర్శనతో భారత్లో భారత్ను ఓడించారు. 227 పరుగుల తేడాతో విజయం. ఇంగ్లండ్ జట్టు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. సారథిగా 26వ టెస్టు విజయాన్ని అందుకున్న జో రూట్కు శుభాకాంక్షలు' అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.
'జేమ్స్ అండర్సన్ ఎప్పటికీ మా అత్యుత్తమ బౌలర్. ఇంగ్లండ్కు శుభాకాంక్షలు. సంపూర్ణ విజయమిది' అని నాసర్ హుస్సేన్ అన్నాడు.


Click it and Unblock the Notifications












