
పుణే: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్న బెయిర్స్టో.. రెండో వన్డేలో ఆ మార్క్ అందుకున్నాడు. 112 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. బెయిర్స్టో కారణంగా వన్డే సిరీస్లో ఇంగ్లండ్ రేసులోకి వచ్చింది. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం కాగా.. నిర్ణయాక చివరి మ్యాచ్ ఆదివారం జరుగనుంది. కీలకమైన మూడో వన్డేలో కూడా బెయిర్స్టో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు.
అయితే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం జానీ బెయిర్స్టో ఘోరంగా విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో మూడు సార్లు డకౌట్గా వెనుదిరిగిన బెయిర్స్టోపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. టెస్టు మ్యాచ్ ఆడే సమయంలో క్రీజులో ఉండడానికి బెయిర్స్టో ఆసక్తి చూపించడం లేదని కామెంట్ చేశాడు. తాజాగా లిటిల్ మాస్టర్ గవాస్కర్ వ్యాఖ్యలపై బెయిర్స్టో స్పందించాడు. సునీల్ గవాస్కర్.. నా ఫోన్ ఆన్లోనే ఉందని బెయిర్స్టో చురకలు వేశాడు.
'నిజానికి సునీల్ గవాస్కర్ నా పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలియదు. అప్పుడే తెలిసి ఉంటే.. వెంటనే స్పందించేవాడిని. ఏదైతేనేం గవాస్కర్ కావాలంటే నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. టెస్టు క్రికెట్లో కుదురుగా ఆడడానికి ఒక లెజెండరీ క్రికెటర్ ఇచ్చే విలువైన సలహాల కోసం ఎదరుచూస్తున్నా. అతను కోరుకుంటే.. నాకు కాల్ చేయొచ్చు లేదా ఫోన్ ద్వారా మెసేజ్ పంపొచ్చు. ఎందుకంటే నా ఫోన్ ఇప్పుడు ఆన్లో ఉంది' అని బెయిర్స్టో సన్నీపై సెటైర్ వేశాడు. మరి బెయిర్స్టో రిప్లైపై గవాస్కర్ స్పందిస్తాడేమో చూడాలి.
ఇరుజట్ల మధ్య కీలకమైన మూడో వన్డేలో భారత జట్టులో మూడు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫామ్లేమితో సతమతమవుతున్న కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. కెరీర్లో రెండో మ్యాచ్ ఆడిన కృనాల్ పాండ్యా కేవలం 6 ఓవర్లలోనే 72 రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే లెగ్స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్కు విశ్రాంతినిచ్చి యార్కర్ స్పెషలిస్ట్ టీ నటరాజన్ను ఆడిస్తారో చూడాలి. మరోవైపు ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు.