
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలం నుంచి తప్పుకోవడం కఠినమైన నిర్ణయమే అని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరామం లేకుండా షెడ్యూల్ ఉండటంతో తప్పడం లేదన్నాడు. వేలంలో పాల్గొనేందుకు వచ్చే ఏడాది తప్పకుండా ప్రయత్నిస్తానని రూట్ వెల్లడించాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో శనివారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అది జో రూట్కు వందో టెస్టు. రూట్ తొలి ఇన్నింగ్స్లో 218, రెండో ఇన్నింగ్స్లో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రెండో టెస్టుకు ముందు శుక్రవారం జో రూట్ మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ 2021 వేలం నుంచి ఎందుకు తప్పుకున్నారు అని ఓ విలేకరి అడగ్గా.. 'వేలం నుంచి తప్పుకోవడం కఠిన నిర్ణయమే. ఐపీఎల్లో భాగమయ్యేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది చాలా టెస్టు క్రికెట్ ఉంది. అందుకే లీల్లో ఆడేందుకు ఇది సరైన సమయంగా భావించడం లేదు. పూర్తిగా ఏకాగ్రత కనబర్చలేనని అనిపిస్తోంది. ఇప్పుడు లభిస్తున్న మొత్తంతోనే ఇంగ్లండ్ క్రికెట్కు అత్యుత్తమ సేవ చేస్తున్నానని అనుకోను. బహుశా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడతా. కనీసం వేలంలోనైనా భాగమవుతా' అని తెలిపాడు.
'జోఫ్రా ఆర్చర్ మోచేతికి గాయమైంది. రెండో టెస్ట్ కోసం ఆర్చర్ స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ ఆడుతాడు. బ్రాడ్ మేటి బౌలర్. అతడు ఇదివరకు ఎలా రాణించాడో ఇప్పుడు అలానే ఆడతాడు. రెండో టెస్టుకు స్పిన్నర్ డొమినిక్ బెస్, పేసర్ జేమ్స్ అండర్సన్కు విశ్రాంతిని ఇచ్చాం. వీరి స్థానాల్లో స్థానాల్లో క్రిస్ వోక్స్, మొయిన్ అలీ ఆడతారు. రొటేషన్ పాలసీలో భాగంగా జోస్ బట్లర్ స్వదేశం వెళ్లాడు. బెన్ ఫోక్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు' అని రూట్ స్పష్టం చేశాడు.
తొలి మ్యాచులో గెలిచిన ఉత్సాహం ఉన్నప్పటికీ రెండో మ్యాచులో ఎదురయ్యే సవాళ్ల గురించి తెలుసని రూట్ పేర్కొన్నాడు. 'మాకు గట్టి సవాళ్లు ఎదురవుతాయని తెలుసు. ప్రస్తుతం మేం 1-0తో ఉన్నాం. తెలివైన క్రికెట్ ఆడాం. ఉపఖండం పరిస్థితుల్లో గెలవాలంటే ఎంత కష్టపడాలో మేం అర్థం చేసుకోగలం. సవాల్ను గెలిచేందుకు ఏం కావాలో తెలుసు. తొలి ఇన్నింగ్స్లో కోహ్లీని ఔట్ చేసేందుకు బెస్ తెలివైన బంతి విసిరాడు. అలాగే తెలివైన బంతులు విసిరి ఒత్తిడి చేస్తాం. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు' అని రూట్ చెప్పాడు.