
600-700 పరుగులు కొట్టేయడమే లక్ష్యం:
తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మీడియాతో మాట్లాడాడు. 'రెండో రోజు ఆటకు సిద్ధంగా ఉన్నా. భారీ స్కోరుతో టీమిండియాను చిరాకు పెడతానన్న నమ్మకం ఉంది. కాళ్లు తిమ్మిరి పట్టినప్పుడు విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించడం గొప్ప విషయం. సుదీర్ఘంగా ఆడటంతో కొన్ని పానీయాలు తీసుకొని చల్లబడ్డాను. తొలి ఇన్నింగ్స్లో 600-700 పరుగులు చేయగలమేమో చూస్తాం. రెండో రోజు పూర్తిగా లేదా మూడో రోజు వరకు ఆడితే ఊపు అందుకోవచ్చు. అప్పుడేం జరుగుతుందో తెలియదు' అని రూట్ అన్నాడు.

శ్రీలంకతో పోలిస్తే భారత్ పరిస్థితులు బిన్నం:
శ్రీలంకతో పోలిస్తే భారత్ పరిస్థితులు కాస్త భిన్నమని జో రూట్ అంటున్నాడు. లంకలో బంతి కదలికలు, స్పిన్ కాస్త ఎక్కువగా ఉంటుందన్నాడు. మొదట స్పిన్నర్ల బౌలింగ్లో బౌన్స్ను, తర్వాత సీమర్ల బౌలింగ్ రివర్స్ స్వింగ్ను ఎదుర్కోవడం ఇబ్బందేనని వెల్లడించాడు. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనను ఇంగ్లండ్ 2-0 క్లీన్ స్వీప్ చేసింది. రూట్ టెస్ట్ సిరీస్లో 426 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 186 ఇన్నింగ్స్ ఉంది. రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ బ్యాటింగ్ భారాన్ని రూట్ ఒక్కడే మోశాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన రూట్.. రెండో టెస్టులో భారీ శతకంతో జట్టును గెలిపించాడు.

వందో టెస్టు ఆడటం ఎంతో ప్రత్యేకం:
'కెరీర్లో వందో టెస్టు ఆడటం ఎంతో ప్రత్యేకం. ప్రస్తుత ఫామ్ను అందిపుచ్చుకొని భారీ పరుగులు చేయాలనుకున్నా. ఎందుకంటే కెరీర్లో ప్రతిసారీ భారీ స్కోర్లు చేయలేం కదా. భారీ పరుగులు చేసి జట్టును గెలిపించాలన్నదే నా ఉద్దేశం. శ్రీలంకలో కొన్ని ప్రశ్నలు ఎదురైనా.. డొమినిక్ సిబ్లీ ఇక్కడ బాగా ఆడాడు. వందో టెస్టుకు ముందు రాత్రి మా జట్టు సభ్యులు గత ఆటగాళ్ల వీడియోలతో నాకు సర్ప్రైజ్ ఇచ్చారు' అని జో రూట్ చెప్పుకొచ్చాడు.

తొలి క్రికెటర్గా రూట్:
కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్నజోరూట్కు ఇది 20వ సెంచరీ. తొలుత హాఫ్ సెంచరీకి 110 బంతులు తీసుకున్న జోరూట్ అనంతరం ధాటిగా ఆడి మరో 54 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. దాంతో 98, 99, 100వ మ్యాచ్ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్గా జో రూట్ చరిత్ర కెక్కాడు. ఇక 100వ మ్యాచ్లో సెంచరీ చేసిన 9వ ఆటగాడిగా కూడా ఈ ఇంగ్లండ్ కెప్టెన్ గుర్తింపు పొందాడు


Click it and Unblock the Notifications












