
చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా టీమిండియాతో చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. జేమ్స్ అండర్సర్ 3/17, జాక్ లీచ్ 4/76 దెబ్బకు రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్లో బోణి కొట్టింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఈ ఒక్క ఓటమి టీమిండియాను దెబ్బ తీసింది. టాప్ ప్లేస్లో ఉన్న భారత్.. ఈ ఓటమి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయేలా చేసింది.
అయితే ఇంగ్లండ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన ఆ జట్టు కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న కెప్టెన్గా రూట్.. ఆ జట్టు మాజీ సారథి మైకెల్ వాన్తో సంయుక్తంగా అగ్ర స్థానంలో నిలిచాడు. వాన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 51 టెస్టులు ఆడి 26 గెలిచి, 11 ఓడి, 14 డ్రా చేసుకుంది. ఇక రూట్ కెప్టెన్సీలో 47 మ్యాచ్ల్లోనే 26 మ్యాచ్లు గెలిచి, 15 ఓడి, 6 డ్రా చేసుకుంది. ఇంకా ఒక టెస్టు మ్యాచ్ గెలిస్తే..ఇంగ్లండ్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా రూట్ రికార్డుల్లోకెక్కనున్నాడు.
మైకెల్ వాన్, జో రూట్ల తర్వాత ఆండ్రూ స్ట్రాస్ (24 విజయాలు), అలిస్టర్ కుక్ ( 24 విజయాలు), పీటర్ మే (20 విజయాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసియా గడ్డపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రూట్ మూడో స్థానంలో, ఇంగ్లండ్ తరపున మొదటి స్థానంలో నిలిచాడు. రూట్ సారథ్యంలో ఆరు మ్యాచ్లాడిన ఇంగ్లండ్ అన్నింటిలోనూ విజయం సాధించింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (8 విజయాలు, 21 టెస్టులు), క్లైవ్ లాయిడ్( 7 విజయాలు, 17 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక రూట్ సారథ్యంలో గత 11 టెస్టుల్లో ఇంగ్లండ్ ఓడిపోలేదు. 9 మ్యాచులలో 9 విజయాలు, 2 డ్రాలు చేసుకుంది.
కెప్టెన్గా పలు రికార్డులు అందుకున్న జో రూట్.. తొలి టెస్టులో బ్యాటింగ్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 578 పరుగులు చేయడంలో రూట్ చేసిన డబుల్ సెంచరీ (218 పరుగులు) కీలకపాత్ర పోషించింది. రెండో ఇన్నింగ్స్లో 40 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టు విజయంతో జోష్ మీదున్న టీమిండియాకు భారీ షాకిచ్చిన జో రూట్ సేన.. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13న చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగనున్న రెండో టెస్టుపై ఉత్కంఠ నెలకొంది.