
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. గతవారం న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓడిపోయాక.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీసుకు మధ్యలో ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు భారత క్రికెటర్లకు విరామం ఇచ్చింది బీసీసీఐ. దీంతో వారు నచ్చిన ప్రాంతాల్లో విహరిస్తున్నారు.
బయో బుడగ నుంచి బయటకు వెళ్లి సరదాగా గడిపేందుకు భారత క్రికెటర్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో.. 'ఇట్స్ ఫామిలీ టైమ్' అంటూ కుటుంబాలతో అందరూ చక్కర్లు కొడుతున్నారు. జట్టులోని చాలామందికి బ్రిటన్లోని ప్రాంతాలతో పరిచయం ఉంది. తెలిసిన వాళ్లు ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ కెఫేకు వెళ్లి చక్కని కాఫీని ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను వీరిద్దరూ ఇన్స్టాలో పంచుకున్నారు.
టీమిండియా వన్డే, టెస్టు జట్ల వైస్ కెప్టెన్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే కుటుంబ సమేతంగా బయటకు వెళ్లారు. భార్యా, పిల్లలతో కలిసి లండన్ విధుల్లో విహరిస్తున్నారు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పార్క్లు, ఆట స్థలాలకు వారిద్దరూ వెళ్తున్నారు. ఎందుకంటే వీరిద్దరికీ 2-3 ఏళ్ల వయసు పిల్లలున్న సంగతి తెలిసిందే. అక్కడ పిల్లలతో సరదాగా గడిపారు. అజింక్య రహానే అందుకు సంబందించిన చిత్రాలను పంచుకొన్నాడు. అందులో రోహిత్, రహానే తమ చిన్నారులను ఎత్తుకున్నారు.
అలాగే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వారి వారి కుటంబాలతో ఇంగ్లండ్లో సరదాగా గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. భారత క్రికెటర్ల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.