

హైదరాబాద్: ఇంగ్లాండ్తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక సిరిస్ కోసం టీమిండియా సిద్ధంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా జరిగే తొలి టీ20 కోసం టీమిండియా ఇప్పటికే మాంచెస్టర్కు చేరుకున్న సంగతి తెలిసిందే.
మంగళవారం జట్టులోని ఆటగాళ్లు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్లో కసరత్తులు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. కాగా, తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "మాకు టీ20ల్లో తగినంత అనుభవం ఉంది. జట్టులోని ఆటగాళ్లు తమ పని చేస్తే చాలు'' అని అన్నాడు.
ఇరు జట్ల మధ్య బుధవారం ఓల్డ్ ట్రాఫొర్డ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20ల సిరిస్ని కైవసం చేసుకున్న కోహ్లీసేన, ఇంగ్లాండ్ పర్యటనను కూడా విజయంతో ప్రారంభించాలని ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా అంతే ఉత్సాహంతో ఉంది.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్ను 5-0తో క్లీన్ స్వీస్ చేసింది. దీంతో అదే జోరుని భారత్తో జరిగే టీ20 సిరీస్లోనూ కొనసాగించాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో అలెక్స్ హేల్స్, జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్లు సూపర్ ఫామ్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత టీ20 సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.
జట్ల వివరాలు:
ఇండియా:
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, ధోని, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, హార్దిక్ పాండ్యా, సిద్దార్ధ్ కౌల్, ఉమేశ్ యాదవ్
ఇంగ్లాండ్:
ఇయాన్ మోర్గాన్, మెయిన్ అలీ, టామ్ కుర్రాన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ ప్లుంకేట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, డావిద్ మాలన్, జానీ బెయిర్ స్టో, జేక్ బాల్, జోస్ బట్లర్.