తొలి వన్డేలో నమోదైన పలు రికార్డులు, గణాంకాలివే
హైదరాబాద్: టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ను చిత్తుచేసిన టీమిండియా తొలి వన్డేలో ఇంగ్లాండ్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సహచర క్రికెటర్లు విఫలమైన చోట కోహ్లీ, కేదార్ జాదవ్లు అద్భుతమైన సెంచరీలతో విజృంభించి జట్టుకు సంచలన విజయాన్నందించారు.
ఆదివారం పూణెలో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ తొలి వన్డేలోనే జట్టుకు శుభారంభాన్నిచ్చాడు.
అంతేకాదు ఇంగ్లాండ్తో జరిగిన తొల వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, తన కెరీర్లో 27వ సెంచరీ సాధించాడు. మరో సెంచరీ వీరుడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేదార్ జాదవ్తో కలిసి కోహ్లీ ఐదో వికెట్కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో తొలి వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి.
తొలి వన్డేలో నమోదైన పలు రికార్డులు, గణాంకాలివే:

సచిన్ రికార్డుని అధిగమించిన కోహ్లీ
వన్డేల్లో విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మన్గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (14 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ కోహ్లీ (15 సెంచరీలు) అధిగమించాడు. 463 వన్డేలాడి సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకోగా విరాట్ కోహ్లీ కేవలం 177వ వన్డేలోనే ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు రెండో ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్తో సమానంగా విరాట్ కోహ్లీ 17 సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ 232 ఇన్నింగ్స్లాడితే కోహ్లి 96వ ఇన్నింగ్స్లోనే సాధించాడు.

నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన జాదవ్
ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత తరఫున కేదార్ జాదవ్ది నాలుగో వేగవంతమైన సెంచరీ. అంతేకాదు వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్మన్గా కేదార్ నిలిచాడు. 65 బంతుల్లోనే ఈ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

350కుపైగా లక్ష్యాన్ని మూడోసారి చేధించిన భారత్
వన్డేల్లో 350 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు ఇది మూడోసారి. ఇదిలా ఉంటే భారత జట్టుపై ఇంగ్లాండ్కు ఇదే అత్యధిక స్కోరు. పూణె వన్డేలో 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 350 పరుగులు చేసింది.

కోహ్లీకి ఇది 27వ సెంచరీ
వన్డేల్లో ఛేదనలో కోహ్లీ (17) అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. మొత్తంగా చూస్తే వన్డేల్లో కోహ్లీకిది 27వ సెంచరీ. గత 14 వన్డే ఇన్నింగ్స్లో కోహ్లీ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది పదోసారి.

ఐదో వికెట్ భాగస్వామ్యం
ఐదో వికెట్కు కేదార్ జాదవ్, విరాట్ కోహ్లీల జోడీ 200 పరుగుల భాగస్వామ్యం ఐదో అత్యుత్తమం కావడం విశేషం. జింబాబ్వేపై గతంలో ఐదో వికెట్కు ధోని-సురేశ్ రైనాల జోడీ నెలకొల్పిన 196 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు.

కేదార్ జాదవ్ రెండో సెంచరీ
పూణే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో కేదార్ జాదవ్ 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు నమోదు చేశాడు. ఇది జాదవ్కు రెండో సెంచరీ. 2015లో జింబాబ్వేపై తొలి సెంచరీ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications