
చెన్నై: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి ఎమోషనల్ అయ్యాడు. గత నెల 16న మరణించిన తన తండ్రి హిమాన్షు పాండ్యా జ్ఞాపకాలను హార్దిక్ నెమరువేసుకున్నాడు. విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చి తండ్రి కళ్లలో ఆనందాన్ని చూసిన హార్దిక్.. ఒకప్పటి వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. కుమారుడు గిఫ్ట్గా ఇచ్చిన కారును చూసిన తండ్రి మురిసిపోయాడు. తానిచ్చిన బహుమతిని చూసిన తండ్రి చిన్నపిల్లాడిలా నవ్వాడని పాండ్యా గుర్తు చేసుకున్నాడు.
'ఈ రోజు మీరు మాతో లేరన్న బాధను తట్టకోలేకపోతున్నా. చాక్లెట్ అందుకున్నప్పుడు నవ్వే చిన్నపిల్లాడి లాంటి ఆ నవ్వు నన్ను నవ్విస్తోంది. మీరెప్పటికీ గుర్తుంటారు. లవ్ యు మై డాడ్' అని ఆ వీడియోకు హార్దిక్ పాండ్యా క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోపై హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిక్, సోదరుడు కృనాల్ పాండ్యా స్పందించారు. తండ్రి చనిపోయిన రెండు రోజుల తర్వాత పాండ్యా భావోద్వేగ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రేమతో తన తండ్రికి సందేశాన్ని ఇచ్చిన ఆ పోస్ట్ ఫాన్స్, నెటిజన్లను కంటతడి పెట్టించింది. హిమాన్షు పాండ్యా గత జనవరి 16న గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. తన తండ్రి చనిపోయిన టైమ్లో పాండ్యా ఇంట్లోనే ఉన్నాడు.
ఒకప్పుడు సూరత్లో హిమాన్షు పాండ్యా కార్ల ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా క్రికెట్ ట్రైనింగ్ కోసం ఆ బిజినెస్ని వదిలేసి వడోదరికి వచ్చేశారు. భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో వారిని చేర్పించి శిక్షణ ఇప్పించారు. టీమిండియాకి కృనాల్ కంటే ముందే ఎంపికైన హార్దిక్.. అప్పట్లో తండ్రికి ఖరీదైన కారుని బహూకరించి సర్ప్రైజ్ చేశాడు. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న హార్దిక్.. వీడియో కాల్ ద్వారా తండ్రితో మాట్లాడాడు. తండ్రిని సర్ప్రైజ్ చేసిన వీడియోని తాజాగా మరోసారి షేర్ చేసిన హార్దిక్ ఎమోషనల్ అయ్యాడు.
గుజరాత్కు చెందిన 27 ఏళ్ల హార్దిక్ పాండ్యా 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 57 వన్డేలు, 43 టీ20 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్లో 532, 50 ఓవర్ల ఫార్మాట్లో 1167, పొట్టి క్రికెట్లో 388 పరుగులు చేశాడు. 2019 సెప్టెంబర్లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్ 2020లో అదరగొట్టాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా సన్నద్ధం అవుతున్నాడు. చెన్నై జట్టు క్వారంటైన్లోకి ఓ రోజు ఆలస్యంగా వచ్చిన హార్దిక్ బుధవారం జట్టుతో కలువనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి వచ్చిన అతడు బౌలింగ్లోనూ పాలుపంచుకొని.. తుది జట్టులోని ఇద్దరు పేసర్లపై పడే భారాన్ని తగ్గించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే 2019లో వెన్ను సర్జరీ చేయించుకున్న పాండ్యా మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడో లేదో చూడాలి.