టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఇంగ్లాండ్ కనీస పోటీ అయినా ఇవ్వగలదా అనే సందేహాలు వచ్చాయి. కానీ తొలి టెస్టు అనంతరం పరిస్థితి అంతా మారిపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో రోహిత్ సేనపై విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ అనంతరం 190 పరుగుల వెనుకంజలో ఉండి కూడా గొప్ప పోరాటపటిమతో నెగ్గింది.
అయితే తొలి టెస్టు ఓటమి అనంతరం టీమిండియాలోని లోపాలపై చర్చలు మొదలయ్యాయి. ఫామ్లో లేని బ్యాటర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇదే తరుణంలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో జట్టుకు దూరమవ్వడం టీమిండియా తీవ్ర ప్రతికూలాంశంగా మారింది. ఇప్పటికే విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్లు కూడా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అనుభవలేమిగా కనిపిస్తోంది.

జడేజా తొడకండరాల గాయం నుంచి కోలుకోవడానికి ఇప్పటికే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి చేరుకున్నాడు. కొన్ని రోజులు ఎన్సీఏ తన ఇల్లు అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు. కానీ కోలుకునే సమయం గురించి జడ్డూ స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు విరాట్ కోహ్లి చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడా లేడా అనే విషయంపై కూడా క్లారిటీ రాలేదు.
అయితే కేఎల్ రాహుల్ గాయం తీవ్రత తక్కువేనని తెలుస్తోంది. మూడో టెస్టుకు అతడు తప్పక అందుబాటులో ఉంటాడని సమాచారం. ప్రస్తుతం రాహుల్ కూడా జడేజాతో పాటు ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు. రాహుల్ తిరిగి జట్టులోకి వస్తే టీమిండియాకు కాస్త ఊరట కలిగినట్లే. ఉప్పల్ మ్యాచ్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసింది రాహుల్యే. తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేశాడు.

కాగా, జడ్డూ, రాహుల్ స్థానాల్లో రెండో టెస్టుకు ముగ్గురు ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ప్లేస్లో గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ సెలక్ట్ అయ్యాడు. మరోవైపు ఆల్రౌండర్ జడేజాకు రిప్లేస్మెంట్గా సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది.ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు జరగనుంది.