
అతి కష్టంగా రెండు పరుగులు:
భారత ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ తప్పిదం కారణంగా.. దూకుడుగా ఆడుతున్న యువ ఆటగాడు రిషబ్ పంత్ (25: 20 బంతుల్లో 3x4) రనౌత్ అయ్యాడు. శామ్ కరన్ వేసిన 12వ ఓవర్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించిన పంత్ రనౌటయ్యాడు. కరన్ వేసిన మొదటి బంతిని పంత్ స్వీపర్ కవర్ వైపు షాట్ ఆడాడు. పంత్, కోహ్లీ జోడీ అతి కష్టంగా రెండు పరుగులను పూర్తి చేసింది. డీప్లో ఉన్న ఫీల్డర్ మార్క్ వుడ్ నుంచి బంతిని త్రో రూపంలో అందుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్.. వికెట్లని చూడకుండా బాల్ని వెనక్కి విసిరాడు. అయితే ఆ బంతి వికెట్లని తాకకుండా పక్కగా వెళ్లిపోయింది.

డైవ్ చేసినా లాభం లేకపోయింది:
బట్లర్ త్రో గురి తప్పడంతో మూడో పరుగు కోసం పంత్ని కోహ్లీ పిలిచాడు. అయితే అప్పటికే అతి కష్టంగా రెండో పరుగుని పూర్తి చేసిన పంత్.. ఆ క్రమంలో వికెట్లకి చాలా దూరంగా అలానే పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. దాంతో మూడో పరుగు కోసం స్పందించినా.. వేగంగా నాన్స్ట్రైక్ ఎండ్వైపు పంత్ పరుగెత్తలేకపోయాడు. కోహ్లీ-పంత్ మూడో పరుగుకి ట్రై చేయడంతో.. వేగంగా స్పందించిన బట్లర్.. బంతిని అందుకుని నేరుగా బౌలర్ కరన్కి అందించాడు. దాంతో బంతిని అందుకున్న కరన్ వికెట్లని గీరాటేశాడు. కరన్ రనౌట్ చేసే సమయానికి క్రీజుకి చాలా దూరంలో పంత్ ఉండిపోయాడు. రనౌట్ ప్రమాదం గ్రహించి డైవ్ చేసినా లాభం లేకపోయింది.

నీ తొందరపాటు వల్లే:
విరాట్ కోహ్లీ తొందరపాటు కారణంగా మంచి ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ను రనౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీపై ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఎంతపని చేశావ్ విరాట్ కోహ్లీ' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కోహ్లీ.. నీ తొందరపాటు వల్లే మ్యాచ్ ఓడాం. పంత్ ఉంటే భారీ స్కోర్ చేసేవాడు' అని మరొకరు అన్నారు. 'కోహ్లీకి కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదు. ఇదంతా పంత్ దురదృష్టం', 'కోహ్లీ వల్లే రనౌట్ అయ్యాడు' అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. మరికొందరేమో కోహ్లీకి అండగా నిలిచారు. జట్టు కోసమే మరో పరుగు కోసం పిలిచాడు అంటూ మద్దతు తెలుపుతున్నారు.

విరాట్ బ్యాటింగ్ ఆకట్టుకుంది:
ఏదేమైనా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మాత్రం భారత అభిమానులకు మజానిచ్చింది. గత మ్యాచ్లోనే కోహ్లీ ఫామ్ అందుకుని జట్టును గెలిపించినప్పటికీ.. ఆ ఇన్నింగ్స్ అంత సాధికారికంగా ఏమీ సాగలేదు. కిషన్ ధాటిగా ఆడి ఒత్తిడి తొలగించేయడంతో కోహ్లీ కొంచెం ఆలస్యంగా జోరందుకున్నాడు. కానీ మూడో టీ20లో అలా కాదు. ఆద్యంతం విరాట్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. తొలి టీ20 తరహాలోనే జట్టు కష్టాల్లో పడటంతో ఒక దశ వరకు ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. కానీ చివరి ఓవర్లలో అనూహ్యంగా చెలరేగాడు. మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించిన వుడ్ను అతడి చివరి ఓవర్లో బెంబేలెత్తించాడు. ఆ ఓవర్లో వరుసగా మిడ్వికెట్, మిడాఫ్ల్లో కోహ్లీ బాదిన సిక్సర్లు మ్యాచ్కే హైలైట్.


Click it and Unblock the Notifications
