
చెన్నై: పర్యాటక ఇంగ్లండ్ జట్టు తొలి టెస్ట్లో టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో చెలరేగడంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్లో 178 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్.. 420 పరుగుల లక్ష్యంతో టీమిండియాకు సవాలు విసిరింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 241 పరుగుల ఆధిక్యం సంపాదించిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో ధాటిగా ఆడటానికి ప్రయత్నించి ఇంగ్లీష్ ప్లేయర్స్ వరుస విరామాల్లో వికెట్లు పారేసుకున్నారు. కెప్టెన్ జో రూట్ (40) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్ నదీమ్కి రెండు, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు.
సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అశ్విన్ వేసిన తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో పరుగుల ఖాతా తెరవకముందే ఒక వికెట్ నష్టపోయింది. అనంతరం సిబ్లీ, లారెన్స్ కాసేపు వికెట్ కాపాడుకోవడానికి ప్రయతించారు. అయితే అశ్విన్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి సిబ్లీ (12) పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ 32 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది.
ఈ సమయంలో కెప్టెన్ జో రూట్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇషాంత్ శర్మ బౌలింగ్లో లారెన్స్ (18) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇషాంత్కిది టెస్టుల్లో 300వ వికెట్ కావడం విశేషం. ఆ వెంటనే డేంజర్ బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్ (7)ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో 71కే నాలుగు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రూట్, పోప్ కాసేపు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు.ఈ జోడీని 24వ ఓవర్లో బుమ్రా విడదీశాడు. రూట్ (40)ను పెవిలియన్ చేర్చాడు. ఆపై పోప్, బట్లర్ కాసేపు ఆచితూచి ఆడారు. అనంతరం అశ్విన్, నదీమ్ చెలరేగడంతో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆదివారం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 578 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.
మొత్తం 17.3 ఓవర్లు వేసిన అశ్విన్ 61 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకి సోమవారం అనుకూలిస్తున్నట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 190.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 46.3 ఓవర్లు మాత్రమే భారత్ని ఎదుర్కోగలిగింది. మ్యాచ్లో మంగళవారం ఆట మాత్రమే మిగిలి ఉండగా.. 420 పరుగుల ఛేదన టీమిండియాకి సవాలే.