
అహ్మదాబాద్: భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20 నరేంద్ర మోడీ మైదానంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం మోర్గాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు భారత్ ఒకమార్పులతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానంలో టీ నటరాజన్ తుది జట్టులోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడు. గత మ్యాచులో చోటు దక్కని ఇషాన్కు మళ్లీ నిరాశే ఎదురైంది. సిరీస్ 2-2తో సమం కావడంతో నిర్ణయాత్మక మ్యాచుపై ఆసక్తి నెలకొంది. మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
ఈ సిరీస్లో టాస్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో తెలిసిందే. అది గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఛేదనను ఎంచుకుంటోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు తడబడుతోంది. తొలి మూడు మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ గెలిచింది. అయితే గత మ్యాచ్లోనూ టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. మొదట తడబడ్డప్పటికీ, పుంజుకుని భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ లక్ష్యానికి చేరువగా వచ్చి, త్రుటిలో ఓడింది. ఈరోజు కూడా టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీమిండియా గత ఏడు టీ20 సిరీస్ల్లో ఓటమి ఎరుగకుండా ముందుకు సాగుతున్నది. 2019 తర్వాత భారత్ ఆరు సిరీస్లు నెగ్గి ఒకదాన్ని 'డ్రా' చేసుకుంది. గత ఎనిమిది టీ20 సిరీస్ల్లో ఇంగ్లండ్కు పరాజయం ఎదురు కాలేదు. 2018 నుంచి ఏడు సిరీస్లు చేజిక్కించుకున్న మోర్గాన్ సేన ఒకదాన్ని 'డ్రా'గా ముగించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 18 మ్యాచ్ల్లో చెరో తొమ్మిది గెలిచాయి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చహర్.
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోన్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.