అహ్మదాబాద్: మోతేరాలో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులోని రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 80/4తో నిలిచింది. ధాటిగా ఆడుతున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానే (27) ఔట్ అయ్యాడు. సరిగ్గా విరామ సమయానికి ఒక బంతి ముందు జింక్స్ ఔటయ్యాడు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 37.5 బంతికి స్లిప్లో బెన్ స్టోక్స్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో రోహిత్ శర్మ (32) ఉన్నాడు. తర్వాతి బ్యాట్స్మన్గా రిషభ్ పంత్ విరామం అనంతరం క్రీజులోకి రానున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 205 కన్నా.. భారత్ ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది.
భారత్ 24/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించింది. తొలి గంటసేపు వికెట్ పడకుండా కాచుకున్నా.. తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదట ఓవర్నైట్ బ్యాట్స్మన్ చేటేశ్వర్ పుజారా (17).. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పుజారా రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో భారత్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. బెన్ స్టోక్స్ వేసిన 26వ ఓవర్ నాలుగో బంతిని కోహ్లీ ఫ్లిక్ చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్కి తాకి కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడింది. అనూహ్యంగా దూసుకొచ్చిన షార్ట్పిచ్ బంతి ఆడలేక కోహ్లీ వెనుదిరిగాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రోహిత్ శర్మ మాత్రం ఆచితూచి ఆడాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. రోహిత్ శర్మకు జతగా క్రీజులో నిలబడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా.. జింక్స్ బౌండరీలు బాదుతూ వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. స్వల్ప వ్యవధిలో పుజారా, కోహ్లీ ఔటవ్వడంతో భారమంతా రోహిత్, రహానే పైనే పడింది. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ కాసేపు వికెట్ పడకుండా చూసుకున్నారు. కానీ భోజన విరామానికి ముందు రహానే ఔటై నిరాశపరిచాడు.
గురువారం ప్రారంభం అయిన నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేయగా.. డాన్ లారెన్స్ (46; 8 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4/68), ఆర్ అశ్విన్ (3/47) మరోసారి మాయ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ గురువారం ఆట ముగిసే సమయానికి గిల్ (0) వికెట్ కోల్పోయి 24 పరుగులు చేసింది.
ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారు.. వారిని కఠినంగా శిక్షించాలి! పాకిస్తాన్ పరువు పోయింది: అక్తర్ ఫైర్