హైదరాబాద్: కార్ఢిప్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో కోహ్లీసేనపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో, ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది.
రెండో టీ20లో ఇంగ్లాండ్ టార్గెట్ కుల్దీప్: బౌలింగ్ మెషిన్తో ప్రాక్టీస్
తొలి టీ20లో రాహుల్ సెంచరీ చేయగా.... కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన తోడవడంతో భారత్ తేలిగ్గా విజయం సాధించింది. కానీ రెండో టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. నాలుగు ఓవర్లు వేసిన ఈ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయకపోగా, 34 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ నేపథ్యంలో రెండో టీ20కి ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సన్నద్ధమైన తీరుపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "తొలి ఆరు ఓవర్లలోనే 3 కీలక వికెట్లు కోల్పోయాం. మేం చేయాల్సిన దాని కంటే 15 పరుగులు తక్కువ చేశాం. 149 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బాగానే ప్రయత్నించాం. కానీ మధ్య ఓవర్లలో పరుగులు కట్టడి చేసి.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే కుల్దీప్, చాహల్లను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దీటుగా ఎదుర్కోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ సొంతమైంది" అని అన్నాడు.
తొలి టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు గాను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బౌలింగ్ యంత్రం సాయంతో మ్యాచ్ ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. మెర్లిన్ అని పిలిచే ఈ మెషీన్ బౌలర్ల బౌలింగ్ యాక్షన్ను అనుకరిస్తూ బంతులను విసురుతుంది.
దీనిని ప్రాక్టీస్ చేయడంతో హేల్స్ (41 బంతుల్లో 58) కుల్దీప్ బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో రెండో టీ20లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో టీ20 జరిగిన కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరిగిన ఐదు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఒక వేదికపై ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు నెలకొల్పింది.