
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ మైదానంలో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. టీ బ్రేక్ సమయానికి 56 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓలి పోప్ (21), డానియెల్ లారెన్స్ (15) ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు 23 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అంతకుముందు భోజన విరామానికి 74/3తో నిలిచిన ఇంగ్లండ్ ఈ సెషన్లో మరో రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. కాగా బెన్ స్టోక్స్ (55) అర్ధశతకం సాధించాక వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడో టెస్ట్లాగే ఇంగ్లండ్ను స్పిన్తో బెదరగొట్టాలనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్పిన్నర్ అక్షర్ పటేల్ను త్వరగానే బౌలింగ్కు దించాడు. అయితే ఈ ఎత్తుగడ ఫలించింది. అక్షర్ వేసిన 5వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ డొమినిక్ సిబ్లీ క్లీన్ బోల్డ్ అయ్యాడు. అక్షర్ వేసిన బంతి సిబ్లీ బ్యాట్ మధ్యలో నుంచి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. 8 బంతులు ఎదుర్కొన్న అతడు రెండు రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
మరికొద్ది సేపటికే ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ తాను వేసిన రెండో ఓవర్లో జాక్ క్రాలే (9) భారీ షాట్కు యత్నించి మొహ్మద్ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ను కోలుకొని దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ జో రూట్ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 30 పరుగుల వద్ద కీలక మూడో వికెట్ నష్టపోయింది. ఈ సమయంలో ఇంగ్లిష్ టీమ్ను స్టోక్స్, బెయిర్స్టో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో లంచ్ లోపు ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోలేదు. లంచ్ సమయానికి 25 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసింది.
లంచ్ అనంతరం కాసేపటికే సిరాజ్ అద్భుతమైన డెలివరీతో బెయిర్స్టోను బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అయి బెయిర్స్టో ప్యాడ్లను తాకి వికెట్ల మీదుగా వెళ్లింది. టీమిండియా అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు. అయితే అంపైర్ నిర్ణయంపై బెయిర్ స్టో రివ్యూ కోరాడు. రిప్లేలో మాత్రం బంతి మిడిల్ స్టంప్ వికెటన్లు తాకినట్లుగా తేలింది. ఈ సమయంలో స్టోక్స్కు అండగా పోప్ నిలిచాడు. ఈ క్రమంలో 114 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో స్టోక్స్ టెస్టుల్లో 24వ అర్ధ శతకం సాధించాడు.
అయితే ప్రమాదకరంగా మారుతున్న స్టోక్స్ను సుందర్ బోల్తా కొట్టించాడు. ఆపై పోప్, లారెన్స్ ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా, సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు.