
చెన్నై: చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టుకు భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) 50 శాతం ప్రేక్షకులను మైదానాల్లోకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో చెన్నైలోని చెపాక్ స్టేడియం అభిమానులతో కళకళలాడుతుంది. దాదాపు ఏడాది విరామం తర్వాత భారత్లో మ్యాచ్ జరగడంతో.. మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. 50వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న చిదంబరం స్టేడియంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో 15వేల మందికి మ్యాచ్ను చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.
చాలా రోజుల తర్వాత మైదానంలోకి వచ్చిన ఫాన్స్.. అరుపులు, కేకలతో హోరెత్తించారు. దీంతో చెపాక్ స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి జాతీయ జెండాతో సందడి చేశారు. మిగతావారు కూడా ఫొటోలు దిగుతూ మ్యాచ్ ఆస్వాదిస్తున్నారు. ఫాన్స్ సందడికి సంబందించిన వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది. 'చెన్నై స్టేడియానికి కొత్త కళ వచ్చింది. సుధీర్ఘ కరోనా విరామం తర్వాత మైదానంలో అభిమానులను చూడడం సంతోషంగా ఉంది' అంటూ కాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరికొన్ని పోటోలను కూడా బీసీసీఐ పంచుకుంది.
రెండో టెస్ట్ మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు చెపాక్ స్టేడియం అధికారులు పేర్కొన్నారు. స్టేడియంను ఉదయం కూడా శానిటైజ్ చేశామని, ఫేస్ మాస్క్ ఉన్న ప్రేక్షకులను మాత్రమే లోపలి అనుమతించినట్లు అధికారులు తెలిపారు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరు రూల్స్ పాటించడకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. మాస్క్ పెట్టుకోకపోవడమే కాకుండా.. పక్కపక్కనే కూర్చున్నారు.
చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ మూడు వికెట్లు కష్టాలలో పడింది. రెండో ఓవర్లోనే శుభ్మన్ గిల్ డకౌట్గా వెనుదిరగగా, రోహిత్ శర్మ, చేటేశ్వర్ పుజారా (21) రెండో వికెట్కు 85 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే లీచ్ వేసిన బంతిని సరిగా అర్ధం చేసుకోలేక స్లిప్లో క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(0).. మొయిన్ అలీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 86 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఆపై రహానే, రోహిత్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్( 83), రహానే (17) ఉన్నారు. భారత్ 33 ఓవర్లలో 121 రన్స్ చేసింది.