
న్యూ ఢిల్లీ: బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్-ఇండియాల తొలి టెస్టు జరిగింది. ఇందులో కేవలం 31పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా రెండో టెస్టులో కచ్చితంగా విజయం సాధించాలని నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు జట్టు రాణించాలంటే జట్టులో మార్పులు చేయాలంటూ సూచిస్తున్నారు సీనియర్ క్రికెటర్లు. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ టీమ్ మేనేజ్మెంట్ పుజారాకి ఛాన్సివ్వాలని మాజీ క్రికెటర్ మోహిందర్ అమరనాథ్ సూచించారు.
శనివారం ముగిసిన తొలి టెస్టులో పుజారాని పక్కన పెట్టిన టీమిండియా.. అతని స్థానంలో కేఎల్ రాహుల్ని ఆడించింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్.. రెండు ఇన్నింగ్స్ల్లో 4, 13 పరుగులతో నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ పిచ్లు స్వింగ్కి ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో.. సహనంతో క్రీజులో పాతుకుపోయే పుజారా జట్టులో ఉంటే మంచిదని అమరనాథ్ సూచించారు. తొలి టెస్టులో 194 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు పేలవ రీతిలో వికెట్లు చేజార్చుకుని 31 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
భారత జట్టులో విరాట్ కోహ్లి మాత్రమే రెండు ఇన్నింగ్స్లో 149, 51 పరుగులతో మెరిశాడు. 'రెండో టెస్టుకి తుది జట్టు ఎంపికపై టీమిండియా సెలక్షన్ కమిటీ కొంచెం ఆలోచిస్తే మంచిది. ఫాస్ట్ బౌలర్లు స్వింగ్, పేస్ రాబట్టడంతో తొలి టెస్టులో బ్యాట్స్మెన్స్ చాలా ఇబ్బందిపడ్డారు. అందుకే.. లార్డ్స్ టెస్టుకి పుజారాని తుది జట్టులోకి తీసుకోవాలి. అతను ప్రస్తుతం ఫామ్లో లేడని నాకు తెలుసు. కానీ.. అతను సహనంతో ఎక్కువసేపు క్రీజులో నిలవగలడు. కొంచెం టైమ్ తీసుకున్నా.. కచ్చితంగా అతను మునుపటి ఫామ్ని అందుకుంటాడు' అని మోహిందర్ అమరనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
మూడు ఫార్మాట్లు ఆడాలనే ఉద్దేశ్యంతో బయల్దేరిన టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లను పూర్తి చేసుకుంది. టీ 20లో గెలుపును సొంతం చేసుకుని వన్డే సిరీస్ చేజార్చుకుంది. ఇప్పుడు ఈ టెస్టు సిరీస్లో అయినా గెలిచి ఆధిక్యం ప్రదర్శించాలని ఆశపడుతోంది.