
చెన్నై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫిబ్రవరి 13న ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆరంభం కానున్న రెండో టెస్టుకు ఒక ప్రత్యేకత ఉంది. 2012 నుంచి ఇప్పటిదాకా మూసి ఉంచిన ఐ, జే, కే స్టాండ్స్ను అభిమానుల కోసం తెరవబోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టాండ్స్ను నిర్మించారన్న కారణంతో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ వీటి వినియోగానికి అనుమతి నిరాకరించడంతో 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత మూసేశారు. ఈ వివాదం ఏళ్ల పాటు కొనసాగింది. గత ఏడాదే వివాదం సద్దుమణిగి ఈ స్టాండ్స్కు అనుమతి లభించింది.
చెపాక్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అన్ని వైపులా అభిమానులు హంగామా చేస్తుంటే.. ఐ, జె, కె స్టాండ్స్ మాత్రం ఖాళీగా కనిపించాయి. వివిధ సమస్యల వల్ల 2011 ప్రపంచకప్ అనంతరం ఈ మూడు స్టాండ్లను సీజ్ చేశారు. అయితే 2012లో భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన వన్డే కోసం ప్రత్యేక మినహాయింపుతో స్టాండ్లకు అనుమతి ఇచ్చారు. 12 వేల సీట్లు ఖాళీగా ఉంచడం వల్లే 2016లో టీ20 ప్రపంచకప్, 2019లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లను చెపాక్లో నిర్వహించలేదు.
గత ఏడాదే ఈ వివాదం సద్దుమణిగి ఐ, జె, కె స్టాండ్స్కు అనుమతి లభించింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఇక్కడ మ్యాచులు జరగలేదు. అయితే తొలి టెస్టుకు అభిమానులకు ప్రవేశం కల్పించని తమిళనాడు క్రికెట్ సంఘం.. రెండో టెస్టుకు స్టేడియంలో సగం సామర్థ్యానికి అనుమతి ఇచ్చింది. తాజాగా తెరుస్తున్న స్టాండ్స్లో ఒక్కో దాంట్లో 12 వేల మంది కూర్చునే వీలుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఆన్లైన్లో ఇప్పటికే 15 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు తమిళనాడు క్రికెట్ సంఘం వెల్లడించింది.