
రెండో ఇన్నింగ్స్ మొదలు కాగానే భారత్:
భారీ లక్ష్యాన్ని చూసి బెదిరిపోయారో లేక... ఇంగ్లాండ్ పేస్కు నిలువలేకపోయారో కానీ టీమిండియా రెండో ఇన్నింగ్స్ మొదలు కాగానే భారత్ వికెట్లు టపటపా పడిపోయాయి. వైఫల్యాలను కొనసాగిస్తూ ఓపెనర్ ధావన్ (1) అండర్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా.. పుజారా కూడా అండర్సన్కే ఎల్బీగా చిక్కాడు. అన్నింటికంటే షాక్ ఏంటంటే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కావడం. బ్రాడ్ సంధించిన ఔట్ స్వింగర్ కోహ్లి బ్యాట్ అంచును ముద్దాడుతూ వికెట్కీపర్ బెయిర్స్టో చేతిలో వాలింది.

సంయమనంతో ఆడిన రాహుల్, రహానె:
దీంతో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో రాహుల్, రహానె సంయమనంతో ఆడారు. రహానె ఆచితూచి బ్యాటింగ్ చేయగా.. రాహుల్ దూకుడుగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. వీళ్లిద్దరు అభేద్యమైన నాలుగో వికెట్కు 55 పరుగులు జత చేశారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా.. మెక్గ్రాత్ (563) రికార్డును అండర్సన్ సమం చేశాడు.

సెంచరీతో వీడ్కోలు పలికిన కుక్:
అంతకముందు అలిస్టర్ కుక్ (147; 286 బంతుల్లో 14 ఫోర్లతో అదరగొట్టాడు. సెంచరీతో తన ఆఖరి ఇన్నింగ్స్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. 114/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ను కుక్, రూట్ (125) 190 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సు సెంచరీలతో నడిపించారు. ఈ జోడీ క్రీజులో పాతుకుపోయి పరుగులు సాధించడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. లంచ్ సమయానికి 243/2తో పటిష్టమైన స్థితిలో నిలిచింది ఇంగ్లాండ్. అప్పటికి కుక్ 210 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇంగ్లాండ్ స్కోరు జోరు పెంచిన కుక్, రూట్
లంచ్ తర్వాత కుక్, రూట్ జోరు పెంచడంతో ఇంగ్లాండ్ స్కోరు పరుగులెత్తింది. ఈ క్రమంలో రూట్ 151 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఈ జోడీని ఆఫ్ స్పిన్నర్ హనుమ విహారి వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో కుక్-రూట్ల 259 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. స్టోక్స్ (37), కరన్ (21), రషీద్ (20 నాటౌట్) ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ 423/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. విహారి (3/37), జడేజా (3/179), షమి (2/110) రాణించారు. గాయం కారణంగా ఇషాంత్ 8 ఓవర్లే వేశాడు.


Click it and Unblock the Notifications













