వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను తన బంతులతో వణికిస్తున్నాడు. ఇన్స్వింగర్, ఔట్స్వింగర్స్తో ప్రత్యర్థిని అయోమయానికి గురిచేస్తున్నాడు. దాంతో పాటు బుల్లెట్లా యార్కర్లను సంధిస్తున్నాడు. బుమ్రా విసిరిన పదునైన యార్కర్కు గత టెస్టు హీరో ఒలీ పోప్కు దిమ్మతిరిగింది. బంతిని బ్యాటుతో అడ్డుకునేలోపే వికెట్లు ఎగిరిపడ్డాయి.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఓవర్నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది. యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. గిల్ (34) సెకండ్ టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. 8.3 ఓవర్లకే 50 పరుగులు, 19.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ను అందుకుంది.

59 పరుగులకే డకెట్ (21; 17 బంతుల్లో) తొలి వికెట్గా వెనుదిరిగినా ఒలీ పోప్ (23; 55 బంతుల్లో)తో కలిసి జాక్ క్రాలే (76; 78 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్తో క్రాలే ఔటయ్యాడు.ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జో రూట్ (5; 10 బంతుల్లో)తో కలిసి పోప్ జాగ్రత్తగా ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బుమ్రా రూట్ను బోల్తాకొట్టించాడు. వరుసగా ఇన్స్వింగర్, ఔట్ స్వింగర్స్ విసురుతూ రూట్ను కన్ఫ్యూజ్ చేశాడు. చివరికి బుమ్రా విసిరిన వలలో చిక్కుకుని స్లిప్లో ఉన్న గిల్ చేతికి చిక్కాడు. అనంతరం తర్వాతి ఓవర్లో అద్భుతమైన యార్కర్తో పోప్ను క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ బంతిని చూసి నాన్స్ట్రైకింగ్లో ఉన్న బెయిర్స్టో కూడా షాక్ అయ్యాడు.
బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 136 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిది. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. కాగా, టెస్టుల్లో ఒలీ పోప్ను బుమ్రా 10 ఇన్నింగ్స్ల్లో అయిదు సార్లు ఔట్ చేశాడు. అలాగే జో రూట్ను 20 ఇన్నింగ్స్ల్లో ఎనిమిది సార్లు పెవిలియన్కు చేర్చడం విశేషం.