లండన్: ఇంగ్లండ్తో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (6/38, 5/32) చెలరేగడంతో ఇంగ్లీష్ బ్యాట్స్మన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లండ్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. మూడవ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో మొతేరా పిచ్పై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే టీమిండియా ఘన విజయంపై కొన్ని బ్రిటిష్ వార్తా సంస్థలు తమ అక్కసు వెల్లగక్కాయి. ఇంగ్లండ్ ఓటమికి స్పిన్ పిచ్ కారణమని, రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసిందని రాసుకొచ్చాయి.
ఇంగ్లండ్ జట్టు ఓటమికి స్పిన్ పిచ్ కారణమని, రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసిందని బ్రిటిష్ వార్తా సంస్థలు రాసుకొచ్చాయి. భారత్ క్రీడాస్ఫూర్తి హద్దులు దాటుతుందని, ఇది అసలు టెస్టు క్రికెట్ కాదని నిందిస్తూ పేర్కొన్నాయి. స్వదేశంలో జరిగే సిరీస్లో ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుందని, కానీ ఈ పిచ్ అయిదు రోజులకు సరిపడేది కాదని తమ కథనాల్లో పేర్కొన్నాయి. 12-14 నెలల పాటు నరేంద్ర మోడీ స్టేడియాన్ని నిషేధించాలని కూడా వార్తలు రాసాయి.
అయితే మరికొన్ని బ్రిటిష్ వార్తా సంస్థలు మాత్రం ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనే ఘోర ఓటమికి కారణమని రాసుకొచ్చాయి. ఇంగ్లండ్ బోర్డు అవలంబిస్తున్న రొటేషన్ పద్ధతిని తీవ్రంగా తప్పుబట్టాయి. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నారని ఆరోపించాయి. రెండు రోజుల్లో చవిచూసిన ఘోర ఓటమికి సులువైన కారణాలు చెప్పడానికి వీల్లేదన్నాయి. తొలి ఇన్నింగ్స్లో 74/2తో మంచి స్థితిలో ఉన్నా.. స్పిన్ను ఎదుర్కోలేక బ్యాట్స్మెన్ విఫలమయ్యారన్నాయి. కేవలం ఒకే స్పిన్నర్, నలుగురు నంబర్ 11 బ్యాట్స్మెన్తో బరిలోకి దిగారని అక్కడి వార్తా సంస్థలు విమర్శించాయి.
మొత్తం మ్యాచ్లో 30లో 28 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. దీంతో మొతేరాలో బ్యాట్స్మెన్ విఫలమయ్యారా? లేక స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ మీడియా చెలరేగుతోంది. తాజా విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో నిలిచింది. ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగానే మార్చి 4 నుంచి నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. మరి అప్పుడు పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్లో కూడా మ్యాచులు!!