
హైదరాబాద్: టీమిండియాకు నిజంగా ఇది శుభవార్తే. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలుపు ముంగిట కోహ్లీసేన బోల్తా పడిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నుంచి ప్రారంభ కానున్న రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యే అవకాశం ఉంది.
గతేడాది నవంబర్లో బ్రిస్టల్లోని ఓ పబ్లో ఇద్దరు వ్యక్తులపై బెన్ స్టోక్స్ పిడి గుద్దులు కురిపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసు బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ విచారణ వాయిదా పడితేనే బెన్ స్టోక్స్ లార్డ్స్ టెస్టులో ఆడే అవకాశం ఉంది.
ఒకవేళ స్టోక్స్ రెండో టెస్ట్ ఆడలేకపోతే.. అతడి స్థానంలో క్రిస్ వోక్స్ను ఆడించాలని ఇంగ్లాండ్ సెలక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు గాయంతో బాధపడుతున్న క్రిస్ వోక్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే, మ్యాచ్ జరిగే ఆగస్టు 9 (గురువారం) నాటికి అతడు ఫిట్గా ఉంటాడని ఇంగ్లాండ్ భావిస్తోంది.
కాగా, ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 21 పరుగులు చేసిన స్టోక్స్.. రహానే, దినేశ్ కార్తీక్ల రూపంలో రెండు వికెట్లు తీశాడు. ఇక, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయిన బౌలింగ్లో మాత్రం చెలరేగాడు. కీలక సమయంలో కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పాండ్యా, షమీ వికెట్లను తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.