
హైదరాబాద్: భారత్తో జరగబోయే మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఆడే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. నెలల తరబడి అతనిపై కొనసాగుతున్న కేసు విచారణ నిమిత్తం స్టోక్స్ కోర్టులో హాజరవుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. గతేడాది బ్రిస్టల్లోని ఓ నైట్ క్లబ్ వద్ద స్టోక్స్ ఇద్దరు వ్యక్తులపై పిడి గుద్దుల వర్షం కురిపించాడు. ఈ కేసు విషయంలో స్టోక్స్ కోర్టుకు హాజరవ్వాల్సి వస్తోంది.
విచారణ వేగవంతంగా జరుగుతుండటంతో స్టోక్స్ క్రమం తప్పకుండా కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నాటింగ్హామ్ వేదికగా ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే మూడో టెస్టులో కూడా అతను ఆడేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. బుధవారం కూడా స్టోక్స్ హాజరుకావాల్సి ఉంది. రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టును మొదటి రెండు టెస్టులకు రెండు రోజుల ముందుగానే ప్రకటించారు. మూడో టెస్టుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ముందుగానే ప్రకటించే యోచనలో ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే స్టోక్స్ మూడో టెస్టులో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయంలో స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్కు విజయం అందించాడు. అయితే అతని స్థానంలో జట్టులోకి వచ్చిన క్రిస్ వోక్స్ కూడా జట్టుకు బలమైన సహకారం అందించాడు. సెంచరీ దాటిన స్కోరుతో పాటుగా రెండు వికెట్లు తీసి రెండో టెస్టులో కీలకంగా వ్యవహరించాడు. ఇలా రెండో టెస్టు విజయం పొందిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. దాంతో క్రిస్ వోక్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా రెండో టెస్టులోనూ భారత్ పరాజయాన్ని చవిచూసింది. లార్డ్స్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమవడంతో ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ , 159 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఆతిథ్య జట్టుకి తొలి ఇన్నింగ్స్లోనే 289 పరుగుల ఆధిక్యం లభించడంతో ఢీలా పడిపోయిన భారత జట్టు.. పేలవ ఆటతీరుతో డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా చేజార్చుకుంది.