
పూణే: మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా శుక్రవారం టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. స్టోక్స్ ధాటికి ఇంగ్లండ్ మరో 6.3 ఓవర్లు ఉండగానే 337 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. స్టోక్స్ ఇన్నింగ్స్లో ఏకంగా 10 సిక్సర్లు, కేవలం 4 ఫోర్లు మాత్రమే ఉండడం విశేషం. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
బెన్ స్టోక్స్ ఔట్ అయిన అనంతరం చాలా నిరాశ చెందాడు. సెంచరీ మార్క్ను అందుకోలేకపోయినందుకు ఆకాశంలోకి చూస్తూ తన తండ్రికి సారీ చెప్పాడు. 99 పరుగుల వద్ద ఔట్ అయినప్పుడు నిరాశగా పెవిలియన్ వైపు వెళుతూ ఆకాశంలోకి చూస్తూ క్షమించమన్నట్లుగా స్టోక్స్ చేతులతో సైగలు చేశాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టోక్స్ తండ్రి గెడ్ స్టోక్స్ గతేడాది బ్రెయిన్ క్యాన్సర్తో మరణించిన సంగతి తెలిసిందే.
పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ అయిదో బంతికి.. బెన్ స్టోక్స్ 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. కుల్దీప్ ఓవర్లో 6, 4 బాదిన స్టోక్స్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత స్టోక్స్ కొట్టిన షాట్లు భారత్ గెలిచే అవకాశాలను పూర్తిగా దూరం చేశాయి. అర్ధ సెంచరీ తర్వాత 11 బంతుల్లో వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 (మొత్తం 49) పరుగులు చేశాడు.
బెన్ స్టోక్స్ రనౌట్ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ అయిదో బంతిని స్టోక్స్ మిడాన్ దిశగా షాట్ను ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన స్టోక్స్.. రెండో పరుగు కోసం ప్రయత్నించగా కుల్దీప్ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. స్టోక్స్ బ్యాట్ క్రీజులో లేకపోవడంతో అంతా అవుటేనని భావించారు. అయితే రిప్లేలో చాలాసార్లు పరీక్షించిన థర్డ్ అంపైర్.. క్లారిటీ లేకపోవడంతో నాటౌట్గా ప్రకటించాడు. అయితే స్టోక్స్ బ్యాట్ గీత దాటి లోపలికి రాకముందే బంతి వికెట్లను గిరాటేసిందని, అది ఔటేనని భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సహా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.